
RRB NTPC 2025–26లో 5,810 ఖాళీలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాన్-టెక్నికల్ పాప్యులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ నియామక ప్రకటన 2025–26ను విడుదల చేసింది. మొత్తం 5,810 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వంటి విభిన్న పదవులను ఈ నియామకం కవర్ చేస్తోంది. సీఈఎన్ నంబర్ 06/2025 కింద ఈ నోటిఫికేషన్ ఈ నెల ప్రారంభంలో విడుదలై, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21 నుండి ప్రారంభమై నవంబర్ 20, 2025 వరకు కొనసాగుతుంది.
ఈ నియామకం భారత రైల్వే యొక్క పలు జోన్లలో ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. ప్రకటన ప్రకారం, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ (161 పోస్టులు), స్టేషన్ మాస్టర్ (615), గూడ్స్ ట్రైన్ మేనేజర్ (3,416), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (921), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (638), ట్రాఫిక్ అసిస్టెంట్ (59) పదవులు ఉన్నాయి. 7వ సెంట్రల్ పే కమిషన్ పే మ్యాట్రిక్స్ ప్రకారం ఈ పోస్టులకు ప్రారంభ వేతనం ₹25,500 నుండి ₹35,400 వరకు ఉంటుంది.
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి కొన్ని పోస్టులకు కంప్యూటర్పై ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి. జనవరి 1, 2026 నాటికి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయస్సు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT–1, CBT–2), అనంతరం అవసరమైన కేటగిరీలకు CBAT (కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్) నిర్వహించబడతాయి. ఈ దశలను పూర్తి చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తుది నియామకానికి పిలువబడతారు.
దరఖాస్తు సరిగ్గా, పారదర్శకంగా సాగేందుకు RRB తప్పనిసరి “క్రియేట్ అన అకౌంట్” దశను ప్రవేశపెట్టింది. సంబంధిత RRB అధికారిక వెబ్సైట్లో వ్యక్తిగత మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకసారి నమోదు చేసిన వివరాలను మార్చడం సాధ్యం కాదు, కాబట్టి జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించింది.
ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణకు డిజీలాకర్ వినియోగం చేయాలని RRB సూచించింది, తద్వారా వెరిఫికేషన్ వేగంగా జరుగుతుంది. ఇతర గుర్తింపు పద్ధతులను ఎంచుకున్నవారు తరువాత దశలలో కఠినమైన తనిఖీలకు లోబడతారు.
పరీక్ష ఫీజు సాధారణ అభ్యర్థులకు ₹500, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనార్టీ, ఆర్థికంగా బలహీన వర్గాలకు ₹250గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు చివరి తేదీ నవంబర్ 22, 2025. అకౌంట్ లేదా RRB ఎంపిక మినహా ఇతర వివరాల సవరణకు నవంబర్ 23 నుండి డిసెంబర్ 2, 2025 వరకు అవకాశం ఉంది. స్క్రైబ్ అవసరమున్న అభ్యర్థులు డిసెంబర్ 3 నుండి 7, 2025 మధ్య తమ వివరాలు సమర్పించవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి ముందు CEN నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవాలని RRB సూచించింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉందని ఈ నియామక ప్రక్రియలో అంచనా. అభ్యర్థులు వివరమైన నోటిఫికేషన్ను చూడటానికి, దరఖాస్తు చేసుకోవడానికి www.rrbchennai.gov.in లేదా ఇతర ప్రాంతీయ RRB వెబ్సైట్లను సందర్శించవచ్చు.
