Let's talk: editor@tmv.in
దేశాభివృద్ధిలో ‘యువ’ అధికారుల పాత్ర కీలకం: తెలంగాణ గవర్నర్

దేశాభివృద్ధిలో ‘యువ’ అధికారుల పాత్ర కీలకం: తెలంగాణ గవర్నర్

Gaddamidi Naveen
19 మే, 2026

తెలంగాణ సమాజం, దేశ అభివృద్ధిలో యువ పరిపాలనా అధికారుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. సోమవారం లోక్ భవన్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శాంతి కుమారి నాయకత్వంలో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా యువ అధికారులను గవర్నర్ అభినందిస్తూ, వారి భవిష్యత్తు కెరీర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రతి ఒక్క అధికారితో విడివిడిగా ముచ్చటించి, ప్రజలపై వారికున్న నిబద్ధతను, సేవా భావాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రొబేషనర్లను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. రేపటి రోజున మీరు క్షేత్రస్థాయిలో పరిపాలనా నాయకులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రజలకు పూర్తి సమగ్రత, కరుణ, అంకితభావంతో సేవ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రజా సేవ అనేది కేవలం ఒక అధికారిక పదవి మాత్రమే కాదని, అది సమాజం, దేశం పట్ల మనకున్న ఒక గొప్ప బాధ్యత అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. యువ అధికారుల నిబద్ధత, నూతన ఆలోచనలు రాష్ట్రంలో సుపరిపాలనకు, సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని ఆయన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.