
రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అప్పులపై చర్చకు నేను సిద్ధం: కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. వరంగల్ చౌరస్తా అయినా, అశోక్ నగర్ అయినా తాము సిద్ధమేనని, టాపిక్, స్థలం, తేదీ మీ ఇష్టం. మీకు చేతనైతే నువ్వు వస్తావో, రాహుల్ గాంధీ వస్తాడో రండి.. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తాము నిజాలు, సాక్ష్యాలతో సహా నిరూపించలేకపోతే.. తాను తన పదవికి రాజీనామా చేసి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సాక్ష్యం
రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తిప్పికొట్టారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. తెలంగాణ రాష్ట్ర అప్పులు కేవలం రూ.2.7 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టంగా తెలిపిందని ఆయన గుర్తుచేశారు. కేంద్రమే ఈ వివరాలు ప్రకటించినప్పటికీ.. ముఖ్యమంత్రి మాత్రం దానికి విరుద్ధంగా ఒక్కోసారి రూ.6 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్లు, మరికొన్ని సార్లు రూ.8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తెలంగాణ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. దానికి కారణం సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల అవినీతి, దోపిడీయే నని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రాలలో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్
అంతకుముందు, జూన్ 30న 'రైతు భరోసా' పెట్టుబడి సహాయ నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ గత 30 నెలల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపిందని, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను దెబ్బతీసిందని, అక్రమ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు.
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు దెబ్బతినడం, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై జరిగినట్లు చెప్తున్న 'ఫోన్ ట్యాపింగ్' వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో, ఈ ఇరు పార్టీల ప్రధాన నేతల మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది.
