
జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా స్థానికులు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల దృష్ట్యా, ఈ డంపింగ్ యార్డును జవహర్ నగర్ నుంచి తక్షణమే తరలించాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో లోక్సభ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. శంకర్ నారాయణ పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఇతర జేఏసీ సభ్యులు ఉన్నారు. స్థానికుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డుకు ప్రస్తుతం రోజుకు సుమారు 8,000 నుంచి 10,000 టన్నుల వరకు ఘన వ్యర్థాలు వస్తుంటాయి. 300 ఎకరాలు, 350 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ డంపింగ్ యార్డ్లో చెత్త కొండలు దర్శనం ఇస్తాయి. ఆ ఏరియాలో చాలా మంది ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు పీల్చే గాలి, తాగే నీరు విషపూరితంగా మారుతున్నాయి.
