
హైదరాబాద్లో ‘జీసీసీ’ ఏర్పాటు చేయనున్న రీజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్
ప్రముఖ అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ ‘రీజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్’ హైదరాబాద్లో తన సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా ఎదుగుతున్న భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ జీసీసీ 2026 ద్వితీయార్థం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
రాబోయే సంవత్సరాల్లో ఈ కేంద్రం ద్వారా వందలాది మంది ఐటీ, ఫార్మా నిపుణులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థ పేర్కొంది. హైదరాబాద్లో ఏర్పాటు కాబోయే ఈ జీసీసీ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీజెనెరాన్ కార్యకలాపాలకు అనుసంధానంగా పనిచేస్తుంది. ఇందులో డేటా మేనేజ్మెంట్, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లినికల్ ట్రయల్ ఆపరేషన్స్, అనలిటిక్స్, కమర్షియల్ ఆపరేషన్స్ వంటి కీలక విభాగాలకు చెందిన బృందాలు పనిచేస్తాయని సంస్థ ప్రతినిధి బారి కోవల్ వెల్లడించారు.
ఈ పెట్టుబడిపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్నోవేషన్లో హైదరాబాద్ అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలుస్తోందని ఆయన అన్నారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాలలో తెలంగాణ నిరంతరం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని మంత్రి తెలిపారు. రాబోయే ‘గ్రీన్ ఫార్మా సిటీ’ ప్రాజెక్టు రాష్ట్ర లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. రీజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ను హైదరాబాద్కు సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఈ పెట్టుబడి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్రంలో ఆవిష్కరణలు మరింత వేగవంతం అవుతాయని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
