Let's talk: editor@tmv.in
గాజువాకలో రైల్వే బ్రిడ్జి కుప్పకూలి.. ఏడుగురికి గాయాలు

గాజువాకలో రైల్వే బ్రిడ్జి కుప్పకూలి.. ఏడుగురికి గాయాలు

Panthagani Anusha
27 ఏప్రిల్, 2026

విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తుంగ్లం సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు.

దువ్వాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు అక్కడ కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ మేరకు పనులు శరవేగంగా సాగుతుండగా ఆదివారం ఉదయం వంతెనపై కాంక్రీట్ వేసే ప్రక్రియ (స్లాబ్ పనులు) ప్రారంభించారు. అయితే కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా పరంజా (సెంటరింగ్) బరువును తట్టుకోలేక కుప్పకూలిపోయింది.

బ్రిడ్జి పైభాగంలో పని చేస్తున్న కార్మికులు ఇనుప రాడ్లు, సిమెంట్ మిశ్రమంతో సహా కిందపడిపోయారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని బుద్ధీశ్వర్, బోస్, అజిత్, దినేశ్, తుసర్, ప్రతాప్, ఉదయ్‌లుగా గుర్తించారు. బాధితులందరినీ వెంటనే షీలానగర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం వహించిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.