
రాఘవ్చద్దాకు జడ్ప్లస్ భద్రత ఉపసంహరణ
పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్చద్దాకు కల్పించిన జడ్ప్లస్ కేటగిరీ భద్రతను పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించినట్లు సమాచారం. ఇటీవల ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో పార్టీతో జరిగిన వాగ్వాదం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రభుత్వమే ముందుగా చద్దాకు జడ్ప్లస్ భద్రత కల్పించింది. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ భద్రతను ఉపసంహరించుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
రాజ్యసభలో పదవి మార్పు
ఏప్రిల్ 2న ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దా స్థానంలో అశోక్మిట్టల్ను నియమించింది. దీనిపై స్పందించిన చద్దా నన్ను ఓడించలేదు, మౌనంగా చేశారని వ్యాఖ్యానించారు. దీనికి పార్టీ నేతలు ప్రతిస్పందిస్తూ చద్దా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో గట్టిగా మాట్లాడటం లేదని విమర్శించారు.
సీఎం వ్యాఖ్యలు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మాట్లాడుతూ పార్టీ విప్ను పాటించకపోవడం వల్లే సమస్య తలెత్తిందని అన్నారు. వెస్ట్ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం, గుజరాత్లో ఆప్ నేతల అరెస్టులు వంటి అంశాలపై చద్దా స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
భద్రత ఉపసంహరణపై శిరోమణి అకాలీ దళ్ నేత బిక్రం సింగ్ మజిథియా తీవ్రంగా విమర్శించారు. పంజాబ్ పోలీసులను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు. అలాగే అసెంబ్లీ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా కూడా విమర్శిస్తూ, రాజకీయ ప్రతీకార చర్యలకే భద్రత వ్యవస్థను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ పరిణామాలతో పంజాబ్ రాజకీయాల్లో రాఘవ్చద్దా– ఆప్ నాయకత్వం మధ్య విభేదాలు మరింత తీవ్రంగా మారినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
