

బెంగాల్లో చివరిదశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ పోలింగ్ బుధవారం జరగనుండగా, ఈ దశలో 3.2 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 142 నియోజకవర్గాల్లో 1,448 అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ఈ ఓటింగ్తో తేలనుంది.ఈ వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ దశలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.22 కోట్లకు పైగా ఉండగా, అందులో 3.21 కోట్ల మంది సాధారణ ఓటర్లు, దాదాపు 40 వేల మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.64 కోట్ల మంది పురుషులు, 1.57 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 792 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యువ ఓటర్లు, వృద్ధులు, దివ్యాంగులు
18–19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు: 4.12 లక్షలకు పైగా
100 ఏళ్లు పైబడిన ఓటర్లు: 3,200కు పైగా
దివ్యాంగ ఓటర్లు : 57,000కు పైగా ఉండగా ఈ విభాగాలన్నింటికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
పోలింగ్ కేంద్రాలు
ఈ దశ కోసం మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 39,301 ప్రధాన కేంద్రాలు, 1,700 సహాయక కేంద్రాలు, 8,845 మహిళల నిర్వహణలో ఉన్న కేంద్రాలు, 13 దివ్యాంగులు నిర్వహించే కేంద్రాలు, 258 మోడల్ పోలింగ్ కేంద్రాలు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు. అదే రోజున అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన దక్షిణ బెంగాల్ ప్రాంతంపై అందరి దృష్టి నిలిచింది. మొత్తం 142 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాకుండా, టీఎంసీ తన బలమైన కోటను నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ తొలిసారి ఆ కోటను ఛేదిస్తుందా అన్నదానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.
దక్షిణ బెంగాల్పై కేంద్రిత పోరు
ఈ దశలో కోల్కత్తా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ వంటి జిల్లాలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘన విజయం సాధించింది. అప్పట్లో టీఎంసీ 142 స్థానాల్లో 123 గెలుచుకోగా, బీజేపీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, దక్షిణ బెంగాల్ను గెలుచుకోకుండా రాష్ట్రంలో అధికారం సాధించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.
భవానీపూర్ కేంద్ర బిందువు
ఈ దశలో అత్యంత ప్రతిష్టాత్మక పోటీగా భవానీపూర్ నియోజకవర్గం నిలిచింది. ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా కీలకమైన ప్రాంతం. ఈ సీటు ఆమెకు ‘రాజకీయ బలపరీక్ష’గా మారింది. బీజేపీ తరఫున లెజిస్లేటివ్ అఫిషియల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2021లో నందిగ్రామ్లో మమతపై విజయం సాధించిన అధికారి, ఇప్పుడు భవానీపూర్ను లక్ష్యంగా చేసుకున్నారు. భవానీపూర్ను మినీ ఇండియాగా పిలుస్తారు. వివిధ మతాలు, భాషలు, వర్గాల ప్రజలు ఉన్న ఈ ప్రాంతం రాజకీయంగా అత్యంత సంక్లిష్టమైన నియోజకవర్గం. మమతా బెనర్జీ ఇక్కడ పాదయాత్రలు, సమావేశాలు, వివిధ మత సంస్థలతో సమావేశాలు నిర్వహించి ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ ప్రభావం
ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ఈ దశలో కీలక రాజకీయ అంశంగా మారింది. ఉత్తర 24 పరగణాల్లో 12.6 లక్షలు, దక్షిణ 24 పరగణాల్లో 10.91 లక్షలు, కోల్కతాలో సుమారు 6.97 లక్షల ఓటర్లు తొలగించినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య గత ఎన్నికల్లో సాధించిన మార్జిన్ కంటే ఎక్కువగా ఉండటం రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రచారంలో తీవ్ర పోటీ
బీజేపీ నేతలు ఈ దశలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అవినీతి, చొరబాటు, హింస, మహిళల భద్రత వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. టీఎంసీ మాత్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలు, బెంగాల్ హక్కుల పరిరక్షణ అంశాలను ముందుకు తెచ్చింది. బీజేపీపై కేంద్రం నుంచి రాష్ట్రాన్ని నియంత్రించాలన్న ప్రయత్నాల ఆరోపణలు చేసింది.
భద్రతా ఏర్పాట్లు
ఎన్నికల కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) విస్తృతంగా మోహరించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదనంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాలు కూడా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో మోహరించారు. మొత్తం పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. ఈ దశ ఫలితాలు రాష్ట్రంలో నాలుగోసారి అధికారాన్ని టీఎంసీ నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీకి చారిత్రక బ్రేక్థ్రూ లభిస్తుందా అన్నది నిర్ణయించనుంది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో దక్షిణ బెంగాల్ గెలుపు లేకుండా నబన్నా దారి లేదు అన్నది మరోసారి ఈ ఎన్నికల కేంద్ర సూత్రంగా మారింది.
