
'టాప్స్' కోర్ గ్రూపులోకి ప్రీతి, అరుంధతి
అంతర్జాతీయ బాక్సింగ్ రింగ్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన యువ బాక్సర్లకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇటీవల మంగోలియాలోని ఉలాన్బాటర్లో ముగిసిన 'ఆసియా బాక్సింగ్ ఎలైట్ ఛాంపియన్షిప్-2026'లో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు బాక్సర్లను ప్రతిష్టాత్మక 'టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్' (టాప్స్) కోర్ గ్రూపులోకి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ చేర్చింది. బుధవారం జరిగిన 172వ మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) అనేది భారత క్రీడాకారులను ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పతకాలు సాధించేలా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకం. సులభంగా చెప్పాలంటే, ప్రపంచ స్థాయి వేదికలపై భారత జెండా రెపరెపలాడాలనే లక్ష్యంతో అత్యుత్తమ క్రీడాకారులకు ఇచ్చే స్పెషల్ సపోర్ట్ ఇది.
పసిడి విజేతలకు పెద్దపీట
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తమ బలాన్ని నిరూపించుకుని స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు)తో పాటు వెండి పతకం గెలిచిన సచిన్ (60 కేజీలు)లను కోర్ గ్రూపులోకి ప్రమోట్ చేశారు. క్రీడాకారుల ప్రస్తుత ఫామ్, ప్రపంచ ర్యాంకింగ్స్, వారి పురోగతిని విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరితో పాటు ఆదిత్య (65 కేజీలు), దీపక్ (70 కేజీలు), హర్ష్ (90 కేజీలు)లను డెవలప్మెంట్ గ్రూపులో చేర్చి, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించనున్నారు.
బాక్సింగ్ పైనే భారత్ ఆశలు
ఈ ఏడాది గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ వంటి కీలక క్రీడలు లేకపోవడం భారత్కు పెద్ద లోటు. ఈ నేపథ్యంలో పతకాల పట్టికలో భారత్ మెరుగైన స్థానంలో నిలవాలంటే బాక్సింగ్పైనే భారీ ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ బాక్సర్ ప్రీతి పవార్ కామన్వెల్త్, ఆసియా క్రీడలు రెండింటికీ ఎంపికై పతకం దిశగా దూసుకెళ్తుండగా, 31 ఏళ్ల సీనియర్ బాక్సర్ నరేందర్కు (+90 కేజీలు) ప్రత్యేకంగా 'టార్గెట్ ఆసియా గేమ్స్ గ్రూప్' కింద ప్రభుత్వం అన్ని రకాల శిక్షణ, ఆర్థిక సహకారం అందిస్తూ అండగా నిలుస్తోంది.
ఉలాన్బాటర్లో పతకాల హోరు
ఇటీవల మంగోలియాలోని ఉలాన్బాటర్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో ఏకంగా 16 పతకాలు కొల్లగొట్టి రికార్డు సృష్టించారు. ఇందులో 5 బంగారు, 3 వెండి, 8 కాంస్య పతకాలు ఉండటం విశేషం. ఈ టోర్నీలో హర్ష్, నరేందర్ కాంస్య పతకాలతో మెరవగా, ఆదిత్య, దీపక్ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకొని గట్టి పోటీని ఇచ్చారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బాక్సర్లు కామన్వెల్త్, ఆసియా క్రీడలకు నేరుగా అర్హత సాధించారు.
మెరుగైన శిక్షణే లక్ష్యం
ప్రస్తుతం బాక్సింగ్ విభాగంలో 'టాప్స్' కోర్ గ్రూపులోఏడుగురు, డెవలప్మెంట్ గ్రూపులో 25 మంది బాక్సర్లు ఉన్నారు. డెవలప్మెంట్ గ్రూప్ ద్వారా వర్ధమాన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, ఎక్స్పోజర్ కల్పించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం. రాబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల కోసం బాక్సర్లు తమ సాధనను మరింత ముమ్మరం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది.
