Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌లో పవర్ ప్లాంట్ పేలుడు.. 17కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లో పవర్ ప్లాంట్ పేలుడు.. 17కి చేరిన మృతుల సంఖ్య

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో ఉన్న వేదాంత లిమిటెడ్‌ పవర్ ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురు కార్మికులు బుధవారం మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం సింగ్‌హితరాయ్ గ్రామంలోని వేదాంత విద్యుత్ కేంద్రంలో జరిగింది. బాయిలర్ నుంచి టర్బైన్‌కు అధిక ఒత్తిడితో ఆవిరిని తరలించే ఉక్కు పైప్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా కాలిన గాయాలు పొందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు కార్మికులు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో తొమ్మిది మంది చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 16కి పెరిగిందని పోలీసులు వెల్లడించారు.

పలువురికి తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో గాయపడిన మరో 18 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురు రాయ్‌పూర్‌‌లోని ఆసుపత్రిలో ఉండగా, మరో 14 మంది రాయ్‌గర్‌‌ జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

ఈ ఘటనపై స్పందించిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇక వేదాంత సంస్థ కూడా ప్రతి మృతుడి కుటుంబానికి రూ.35 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వారు కోలుకునే వరకు జీతాన్ని కొనసాగిస్తామని, కౌన్సెలింగ్ సహాయం కూడా అందిస్తామని సంస్థ వెల్లడించింది.

విచారణకు ఆదేశాలు

ఈ ఘటనపై బిలాస్పూర్ విభాగ కమిషనర్‌తో విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా జిల్లా పరిపాలన మేజిస్ట్రియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

కాంగ్రెస్ డిమాండ్

ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లాంట్ నిర్వహణపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకుడు సుశీల్‌ అనంద్‌ శుక్లా డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆయన కోరారు.

ప్లాంట్ వివరాలు

సింగ్‌హితరాయ్‌లో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2009లో ప్రారంభమైంది. మొదట ఇది అథెనా ఛత్తీస్‌గఢ్‌ పవర్‌‌ సంస్థకు చెందినది. తరువాత 2022లో వేదాంత ఈ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం 600 మెగావాట్ల యూనిట్ పనిచేస్తుండగా, మరో యూనిట్ నిర్మాణంలో ఉంది.