Let's talk: editor@tmv.in
తిరుచిరాపల్లి ఈస్ట్‌లో విజయ్ ఎన్నికల ప్రచారానికి 27 ఆంక్షలతో పోలీసుల అనుమతి

తిరుచిరాపల్లి ఈస్ట్‌లో విజయ్ ఎన్నికల ప్రచారానికి 27 ఆంక్షలతో పోలీసుల అనుమతి

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన, ఆదివారం అక్కడ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ప్రచారానికి తిరుచిరాపల్లి నగర పోలీసులు 27 కఠిన ఆంక్షలతో అనుమతి మంజూరు చేశారు.

అధికారిక సమాచారం ప్రకారం, విజయ్ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అనంతరం ఓపెన్ వాహనంలో ప్రజలను ఉద్దేశించి ప్రచారం చేపడతారు. విమానాశ్రయం సమీపంలోని వైర్‌లెస్ వైర్‌లెస్ రోడ్, కేకే నగర్ బస్ స్టాండ్, కొత్తపట్టు వంటి కీలక ప్రాంతాల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ప్రచార ర్యాలీ ఎయిర్‌పోర్ట్, వైర్‌లెస్ రోడ్, కేకే నగర్, కాజామలై మార్గాల గుండా సాగి తిరిగి ఎయిర్‌పోర్ట్ వద్ద ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రచారం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, పోలీసు శాఖ అనుమతి ఇచ్చాయి.

మేనిఫెస్టోలోని గ్యారెంటీలు

ఇదిలా ఉండగా, ఇటీవల విజయ్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల కోసం నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల వధువులకు 8 గ్రాముల బంగారం, పట్టు చీర అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికి సంవత్సరానికి ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు.

విద్య, ఉపాధి రంగాల్లో కూడా పలు కీలక హామీలు ఇచ్చారు. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల వరకు కోలాటరల్-ఫ్రీ లోన్లు, ఏఐ ఆధారిత ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల కోసం నమోదైన పట్టభద్రులకు నెలకు రూ.5,000 వరకు భృతి, ప్రతి సంవత్సరం 5 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

సామాజిక భద్రత కింద వృద్ధులు, విధవలు, వికలాంగులకు నెలకు రూ.3,000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు పంట రుణ మాఫీ, వార్షికంగా రూ.15,000 ఆర్థిక సహాయం, కనీస మద్దతు ధరలు పెంపు వంటి వాగ్దానాలు చేశారు. మత్స్యకారులకు ప్రత్యేక పథకాలు, ప్రమాద బీమా కూడా ప్రకటించారు. ఆరోగ్య రంగంలో రూ.25 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య బీమా, ఆధునిక ఆసుపత్రులు, ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై సమీక్ష చేస్తామని తెలిపారు.

డీఎంకే, ఇతర పార్టీల మేనిఫెస్టోలు ఒకేలా ఉన్నాయని, అవి ప్రజలను మోసం చేసేలా ఉన్నాయని విజయ్ విమర్శించారు. విజయ్ తన పార్టీ ప్రధాన సిద్ధాంతంగా 'నిజాయితీతో కూడిన పాలన' అందిస్తామని, స్టాలిన్ మాదిరిగా అబద్ధపు హామీలు ఇవ్వమని స్పష్టం చేశారు. 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే కాకుండా, రాష్ట్రాన్ని 'ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి తొలి సారి పోటీ చేస్తున్నారు.

తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. విజయ్ రాకతో ఈసారి ఎన్నికల పోరు త్రిముఖ పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది.