
ఆస్ట్రేలియా విమానాశ్రయంలో హ్యాంగర్ను ఢీకొన్న విమానం.. ఇద్దరు మృతి
ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో ఉన్న పారాఫీల్డ్ విమానాశ్రయంలో బుధవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక చిన్న విమానం విమానాశ్రయంలోని ‘హ్యాంగర్ 54’ (విమానాలను నిలిపి ఉంచే షెడ్)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్ సహా మరో ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో విమానాశ్రయ ప్రాంతం ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయింది.
మంటల అలుముకున్న హ్యాంగర్
విమానం హ్యాంగర్ను ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద తీవ్రతకు హ్యాంగర్ గణనీయంగా దెబ్బతినడమే కాకుండా, పెద్ద ఎత్తున నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పొగ వల్ల స్థానిక ప్రజలు ఇబ్బంది పడకుండా, అందరూ ఇళ్లలోనే ఉండాలని మెట్రోపాలిటన్ ఫైర్ సర్వీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారే కాకుండా, భూమిపై ఉన్న మరికొందరు కూడా గాయపడ్డారు. మొత్తం 11 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలు కాగా, మిగిలిన ఆరుగురు దట్టమైన పొగను పీల్చడం వల్ల శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వీరందరికీ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.
దర్యాప్తు ముమ్మరం
ప్రమాదానికి గురైన విమానం ‘డైమండ్ డీఏ42’ రకానికి చెందిన ట్విన్ ఇంజిన్ విమానంగా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో సమగ్ర విచారణను ప్రారంభించింది. టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం జరగడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు చీఫ్ ఇన్స్పెక్టర్ ఆండ్రూ మెక్క్రాకెన్ మీడియాకు వెల్లడించారు.
