Let's talk: editor@tmv.in
పెంపుడు కుక్క వివాదం.. ఏఐఎస్ అధికారిపై కేసు

పెంపుడు కుక్క వివాదం.. ఏఐఎస్ అధికారిపై కేసు

Shaik Mohammad Shaffee
17 ఏప్రిల్, 2026

భాగ్యనగరంలోని బంజారాహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో కుక్క వ్యర్థాల విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారిపై క్రిమినల్ కేసు నమోదయ్యే వరకు దారితీసింది. తన పొరుగున నివసించే ఓ సీనియర్ మహిళా అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై అటవీ శాఖకు చెందిన అధికారి చిక్కుల్లో పడ్డారు.

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 13వ తేదీన బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రభుత్వ నివాస సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టెలికాం విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న బాధితురాలి పెంపుడు కుక్క వేసిన వ్యర్థాల విషయంలో, పొరుగునే ఉండే అటవీ శాఖ ఏఐఎస్ అధికారికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఉమ్మడి స్థలంలో వ్యర్థాల అంశంపై మాటా మాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వేధింపులు.. అసభ్య చేష్టలు

సదరు అధికారి తన సిబ్బందిని దూషించడమే కాకుండా, తన పట్ల లైంగిక పరమైన వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరమైన సంజ్ఞలతో వేధించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె నివాసం వద్ద ఉన్న పూల కుండీలను కూడా సదరు అధికారి ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళా అధికారిణి పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి పోలీసులు

మహిళా అధికారిణి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడైన ఏఐఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు భారతీయ న్యాయ సంహితలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సదరు అధికారికి నోటీసులు జారీ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని తెలిపారు.