
పటియాలా రైల్వే ట్రాక్ పేలుడు.. బయటపడ్డ ప్రో-ఖలిస్తాన్ మాడ్యూల్
పంజాబ్లోని పటియాలా జిల్లా శంభు ప్రాంతం సమీపంలో ఫ్రైట్ కారిడార్ రైల్వే ట్రాక్పై జరిగిన పేలుడు ఘటన వెనుక ప్రో-ఖలిస్తాన్ టెర్రర్ మాడ్యూల్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. సోమవారం అర్ధరాత్రి శంభు-అంబాలా రైల్వే మార్గంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. మొదట దీన్ని తక్కువ తీవ్రత గల పేలుడిగా భావించినప్పటికీ, తర్వాతి దర్యాప్తులో ట్రాక్ను పేల్చివేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమని అధికారులు నిర్ధారించారు. బోథోనియా గ్రామం సమీపంలో జరిగిన ఈ పేలుడుతో రైల్వే ట్రాక్కు నష్టం కలగడంతో పాటు, ట్రాక్ కింద చిన్న గుంత ఏర్పడింది. ఘటన స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి శరీర అవశేషాలు కూడా లభించాయి. పేలుడు పదార్థాలను అమర్చే సమయంలోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ ప్రకారం, మృతుడు తరన్తరన్ జిల్లాకు చెందిన జాగ్రూప్ సింగ్గా గుర్తించారు. ఈ కేసులో అరెస్ట్ అయినవారిలో మంసా జిల్లాకు చెందిన పర్దీప్ సింగ్ ఖల్సా, కుల్విందర్ సింగ్, తరన్తరన్కు చెందిన సత్నాం సింగ్, గుర్ప్రీత్ సింగ్ ఉన్నారు. పర్దీప్ ఖల్సానే ఈ మాడ్యూల్కు ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు. అతనికి మలేషియా కేంద్రంగా ఉన్న ప్రో-ఖలిస్తాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. యువతను రాడికలైజ్ చేసి విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించి ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి హ్యాండ్ గ్రెనేడ్, రెండు తుపాకులు, గుండు సామగ్రి, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.
గమనించిన లోకో పైలట్.. తప్పిన ప్రమాదం
ఘటన సమయంలో అక్కడ వెళ్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం జరగకుండా తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు చేసే అవకాశముందని ఉన్నతాధికారులు సూచించారు. గత మూడు నెలల్లో ఇదే ఫ్రైట్ కారిడార్పై రెండోసారి పేలుడు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఘటన అనంతరం ఫోరెన్సిక్ బృందాలు, బాంబు నిర్వీర్య దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయని, రైలు రాకపోకలు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. జనవరిలో ఫతేఘఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఫ్రైట్ కారిడార్ ట్రాక్పై పేలుడు జరిగి, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో పాటు లోకోపైలట్ గాయపడిన విషయం తెలిసిందే.
