Let's talk: editor@tmv.in
విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌‌ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ
విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌‌ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ

విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌‌ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ

Gaddamidi Naveen
10 జూన్, 2026

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సోమ‌వారం జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. విశాఖలోని కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం పరామర్శించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ పరామర్శ పర్యటనలో నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యా రాణి, ఎంపీ శ్రీభరత్ ఎం., టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు చింతకాయల విజయ్ తదితరులు ఉన్నారు.

బాధితులకు పూర్తి అండగా ఉంటాం

ఈ పారిశ్రామిక ప్రమాదానికి దారితీసిన నిర్దిష్ట పరిస్థితుల గురించి మంత్రి లోకేష్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాల సమస్యలను, అభ్యర్థనలను ఆయన విన్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ.. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ తీవ్ర విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తోడుగా నిలబడటానికే నేను ఇక్కడికి వచ్చాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్డీయే ప్రజాప్రతినిధులమంతా కలిసి బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇస్తున్నాం. ఈ కష్టకాలంలో ప్లాంట్ కార్మికులకు మేము అండగా ఉంటామ‌ని మంత్రి భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అందరి ఉమ్మడి కృషికి ప్రతీక అని, సమాజం నాయకత్వం కలిసి పోరాడటం వల్లే ఇది రక్షించబడిందని ఆయన గుర్తుచేశారు.

సమగ్ర విచారణ

ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదానికి గల జవాబుదారీతనంపై వ్యక్తమవుతున్న ప్రజా ఆందోళనలపై మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వం ఎంతమాత్రం తేలికగా తీసుకోబోదన్నారు. ప్రమాదంపై ఇప్పటికే సమగ్ర విచారణ కొనసాగుతోందని, విచారణ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత, ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.