Let's talk: editor@tmv.in
ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాపుల బంద్ విజయవంతం

ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాపుల బంద్ విజయవంతం

Gaddamidi Naveen
21 మే, 2026

చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ మందుల విక్రయాలను (ఈ-ఫార్మసీ), కార్పొరేట్ సంస్థల ధరల వ్యూహాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపునిచ్చిన ఒక రోజు దేశవ్యాప్త బంద్ తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ముగిసింది.

తెలంగాణలో 45,000 మెడికల్ షాపులు బంద్

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని స్వల్ప శాతం దుకాణాలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 45,000 మెడికల్ షాపులు మూతపడ్డాయని తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టి. రాజు తెలిపారు. ఉదయం తెరిచిన కొన్ని షాపులను కూడా ఆ తర్వాత మూసివేయించారు. ఈ సమ్మె వల్ల రోగులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే ఫార్మసీలు మందుల సరఫరా కోసం అందుబాటులో ఉంటాయని డీసీఏ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక దుకాణాల నుంచి మందులు లభించేలా చూసేందుకు ఏఐఓసీడీ జిల్లా విభాగాలు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపాయి. అపోలో, మెడ్‌ప్లస్ వంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్లను తెరిచి ఉంచాలని డీసీఏ ఆదేశించింది. అత్యవసర మందుల కొరత తలెత్తితే ప్రజలు వెంటనే స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను లేదా డీసీఏ అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.

విజయవాడలో ఫార్మసీ యజమానుల నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఫార్మసీ యజమానులు ఆన్‌లైన్ మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కెమిస్టులకు మద్దతు ఇవ్వండి, సురక్షితమైన ఆరోగ్య సంరక్షణను రక్షించండి అంటూ వారు నినాదాలు చేశారు. ఆన్‌లైన్ మందుల విక్రయాల వల్ల చిన్న, స్థానిక మెడికల్ షాపుల జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా.. సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తనిఖీలు లేకుండా మందులు డోర్ డెలివరీ చేయడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. తాము రోగుల సేవకు వ్యతిరేకం కాదని, కేవలం డ్రగ్ కంట్రోల్ నిబంధనలను ఉల్లంఘించే పద్ధతులనే వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

12 రాష్ట్రాలు ఈ బంద్‌కు మద్దతు ఇవ్వలేదు..

మరోవైపు, రోగుల సంక్షేమాన్ని దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫార్మసీ బ్రాండ్, ఆసుపత్రి అనుబంధ స్టోర్లు, జన్ ఔషధి కేంద్రాలు, అమృత్ ఫార్మసీలు బుధవారం యథావిధిగా నడిచాయి. బంద్ పిలుపు నేపథ్యంలో ఏఐఓసీడీ ప్రతినిధులు జాతీయ డ్రగ్ రెగ్యులేటర్‌తో సమావేశమై తమ సమస్యలను వివరించారు. ఈ ఫిర్యాదులపై చట్టపరమైన సమీక్ష జరుగుతుందని రెగ్యులేటర్ హామీ ఇచ్చారు.

ముఖ్యంగా ప్రాణ రక్షక మందులపై ఆధారపడే రోగులకు సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, లడఖ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ వంటి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన రిటైల్ ఫార్మసీ అసోసియేషన్లు ఈ బంద్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుని, తాము షాపులను తెరిచే ఉంచుతామని ప్రభుత్వానికి లిఖితపూర్వక హామీలను సమర్పించాయి.