Let's talk: editor@tmv.in
అదానీ, అంబానీలను దేశానికి సాయం చేయమనండి: వి. హనుమంతరావు

అదానీ, అంబానీలను దేశానికి సాయం చేయమనండి: వి. హనుమంతరావు

Gaddamidi Naveen
13 మే, 2026

విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి బంగారం, ఇంధనం, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాని చేసిన 'ఏడు విజ్ఞప్తుల'పై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ ప్రధాని కొత్త పాఠాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్, మీరు బీజేపీకి ఓటు వేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇప్పుడు గెలిచిన తర్వాత డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, బంగారం కొనకండి అంటూ కొత్త నినాదాలు అందుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయాక సామాన్య ప్రజలకు ఉపన్యాసాలు ఇవ్వడం ఆపి, దేశ సంక్షేమం కోసం అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తలను, గుజరాత్ ప్రజలను దేశానికి సాయం చేయమని అడగాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌పై ఎదురుదాడి

మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ప్రధాని విజ్ఞప్తులను సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన, రేషన్ ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, భారత్ తన నిల్వలను కాపాడుకోవడంలో మెరుగ్గా ఉందని చెప్పారు. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి సంక్షోభం లేని సమయంలో కూడా ప్రజలను ఒక పూట భోజనం మానేయమని, బియ్యం వాడకం తగ్గించమని కోరిన చరిత్రను గుర్తుంచుకోవాలని ఆయన గుర్తుచేశారు.