Let's talk: editor@tmv.in
కోర్టు లిఫ్ట్‌లో చిక్కుకున్న లాయర్లు.. గంట తర్వాత బయటకు

కోర్టు లిఫ్ట్‌లో చిక్కుకున్న లాయర్లు.. గంట తర్వాత బయటకు

Panthagani Anusha
24 ఏప్రిల్, 2026

విజయవాడ స్థానిక కోర్టు సముదాయంలో గురువారం విద్యుత్ అంతరాయం ఉద్రిక్తతకు దారి తీసింది. లిఫ్ట్‌లో వెళ్తున్న ఐదుగురు న్యాయవాదులు అకస్మాత్తుగా మధ్యలోనే ఇరుక్కుపోవడంతో ఆందోళన నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కొనసాగుతున్న విద్యుత్ పనుల కారణంగా సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలో లిఫ్ట్ ఏడవ, ఎనిమిదవ అంతస్తుల మధ్యలో ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న న్యాయవాదులు బయటకు రాలేక సుమారు గంటపాటు ఇరుక్కుపోయారు. లిఫ్ట్‌లో వెంటిలేషన్ సదుపాయం ఉన్నప్పటికీ లిఫ్ట్ రెండు అంతస్తుల మధ్య నిలిచిపోవడంతో ఆ లివర్‌ను వినియోగించలేకపోయినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితి విషమించకుండా జాగ్రత్త చర్యగా ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచారు. అనంతరం లిఫ్ట్ ప్యానెల్‌ను తెరిచి గాలి ప్రసరణ కల్పించడంతో లోపల ఉన్నవారికి ఉపశమనం కలిగింది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ అమర్చే పనులు కొనసాగుతున్నాయని వాటి పూర్తి కావడానికి సుమారు గంట సమయం పట్టినట్లు వెల్లడించారు. పనులు పూర్తయ్యాక లిఫ్ట్‌ను సురక్షితంగా తెరిచి అందులో చిక్కుకున్న న్యాయవాదులను బయటకు తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అందరి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు సముదాయాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.