
కడప స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభం.. పునాది వేసింది మా ప్రభుత్వమే: వైఎస్ జగన్
వైఎస్ఆర్ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పునఃప్రారంభమైన సందర్భంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ కి, ఆ సంస్థ బృందానికి ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలియజేశారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి, స్థానిక యువత ఉపాధికి ఇదొక కీలక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇలాంటి మైలురాయి లాంటి ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, క్షేత్రస్థాయి శ్రమ వల్లనే సాధ్యమవుతాయని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే జేఎస్డబ్ల్యూ సంస్థను ఈ ప్రాజెక్ట్ డెవలపర్గా ఖరారు చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూమి కేటాయింపులు, రోడ్డు కనెక్టివిటీ, అనుబంధ మౌలిక సదుపాయాలకు అవసరమైన స్థలాలను తామే సమకూర్చామని వివరించారు. ఈ పక్కా పునాదుల వల్లే తమ హయాంలో పనులు శరవేగంగా సాగాయన్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోవడం, పెట్టుబడులు ఆలస్యం కావడం విచారకరమని జగన్ పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభం కావడం శుభపరిణామన్నారు. అభివృద్ధి అనేది రాజకీయ సరిహద్దులకు అతీతంగా సాగే ఒక నిరంతర ప్రక్రియ. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, గత ప్రభుత్వం చేసిన పనిని ముందుకు తీసుకెళ్లి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కడప నా సొంత జిల్లా కావడం వల్ల నా గుండెల్లో దానికి ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడి యువత పారిశ్రామిక వృద్ధి ద్వారా స్థానికంగానే మరిన్ని ఉపాధి అవకాశాలు పొందాలని నేను ఎప్పుడూ ఆకాంక్షిస్తాను అని జగన్ అన్నారు.
కడప ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ప్లాంట్ పూర్తి కావాలని కోరారు. జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ పనులను మరింత వేగవంతం చేసి, కడపతో పాటు యావత్ రాయలసీమ ప్రాంత ప్రజలకు పారిశ్రామిక వృద్ధి, ఉపాధి ద్వారా లబ్ధి చేకూర్చాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
