Let's talk: editor@tmv.in
త్యాగరాజ సంగీత వారసత్వాన్ని కాపాడటం మనందరి బాధ్యత: పవన్ కళ్యాణ్

త్యాగరాజ సంగీత వారసత్వాన్ని కాపాడటం మనందరి బాధ్యత: పవన్ కళ్యాణ్

Panthagani Anusha
5 మే, 2026

పవిత్రమైన 259వ జయంతి సందర్భంగా కర్ణాటక సంగీత మహానుభావుడు త్యాగరాజ స్వామికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. భక్తిని శాశ్వత ఆధ్యాత్మిక మార్గంగా మలచిన త్యాగరాజ స్వామి భారతీయ సాంస్కృతిక వారసత్వానికి అపూర్వమైన సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామంలో జన్మించిన త్యాగరాజ స్వామి తెలుగు ప్రజలకు గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవలు అపారమని భక్తి, తాత్వికతలతో నిండిన కృతులు తెలుగు భాష, సంస్కృతికి విశిష్ట గుర్తింపు తెచ్చాయని తెలిపారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరిగా ముత్తుస్వామి దీక్షితర్, శ్యామ శాస్త్రిలతో పాటు త్యాగరాజ స్వామి భారతీయ సంగీతాన్ని ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని ఆయన గుర్తుచేశారు. కాగా త్యాగరాజ స్వామి సుమారు 24,000 కృతులను రచించినట్లు చెప్పబడుతున్నప్పటికీ ప్రస్తుతం కేవలం 730 కృతులే అందుబాటులో ఉండటం ఆందోళనకరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అందులో కూడా సుమారు 400 మాత్రమే ప్రదర్శనలో కొనసాగుతున్నాయని, ఈ అమూల్యమైన సంగీత సంపదను భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

‘జగదానంద కారక’, ‘ఎందరో మహానుభావులు’, ‘బంటు రీతి కొలువు’, ‘సామజవరగమనా’, ‘నాగుమోము’ వంటి కృతులు ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, డి.కే. పట్టమ్మాల్ వంటి మహానుభావులు ఆయన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేశారని అన్నారు.

తమిళనాడులోని తిరువయ్యారులో జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను తాను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలోని హంపిలో కూడా ఇలాంటి భక్తి వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాష్ట్ర స్థాయిలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.

త్యాగరాజ స్వామి వారసత్వాన్ని కాపాడేందుకు సమగ్ర డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించారు. పాండులిపులు, నోటేషన్లు, అరుదైన రికార్డులు, మౌఖిక సంప్రదాయాలను డిజిటలైజ్ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచవచ్చని పేర్కొన్నారు.

అదేవిధంగా బమ్మెర పోతన, అన్నమాచార్య వంటి తెలుగు సంత్ కవుల వారసత్వాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. త్యాగరాజ స్వామి సంగీతం భక్తి, తాత్వికత, సాంస్కృతిక విలువల సమ్మేళనంగా నిలిచి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.