
కోట్లాది భక్తుల విశ్వాసాన్ని తప్పు అని ప్రకటించడం కష్టం: సుప్రీంకోర్టు
మత సంబంధ అంశాల్లో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)ల అనుమతిపై విచారణ జరుపుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. కోట్లాది మంది భక్తులు నమ్మే విశ్వాసం తప్పు అని ప్రకటించడం కోర్టుకు అత్యంత క్లిష్టమైన పని అని పేర్కొంది. మహిళలపై వివక్ష ఆరోపణలతో మతపరమైన ప్రార్థనా స్థలాల్లో ప్రవేశం విషయంలో దాఖలైన పిటిషన్లపై తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో ముఖ్యంగా శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశ వివాదం కూడా ఉంది.
ధర్మాసనం పరిశీలనలో ఉన్న అంశాలు
ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పలు కీలక ప్రశ్నలను పరిశీలిస్తోంది. ఒక మతపరమైన సముదాయానికి చెందని వ్యక్తి, ఆ సముదాయపు ఆచారాలను ప్రశ్నిస్తూ పిల్ దాఖలు చేయవచ్చా లేదా అనే అంశం కూడా పరిశీలనలో ఉంది.
టిడిబి వాదనలు
ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ , మతపరమైన ఆచారాలను వ్యాఖ్యానించేందుకు పిల్లను వాహనంగా మార్చకూడదని అన్నారు. ఆర్టికల్ 32 కింద మతపరమైన అంశాల్లో దాఖలయ్యే పిటిషన్లను కోర్టులు సాధ్యమైనంత వరకు నిరుత్సాహపరచాలని ఆయన సూచించారు.
కోర్టు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలు నమ్మే విశ్వాసం తప్పు అని ప్రకటించడం కోర్టుకు అత్యంత కష్టమైన పని అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి బీవీ.నాగరత్న మాట్లాడుతూ బయటి వ్యక్తులు దాఖలు చేసే పిళ్లను అనుమతించకూడదని, సామాజిక సంస్కరణల పేరిట మతాన్ని బలహీనపరచకూడదని చెప్పారు. అలాగే న్యాయమూర్తి ఎంఎం.సురేశ్ మిలియన్ల మంది భక్తుల అభిప్రాయాలను వినకుండా కోర్టు మతపరమైన ఆచారాలపై ఎలా తీర్పు ఇవ్వగలదని ప్రశ్నించారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తులు అహసనుద్దీన్ అమానుల్లాహ్, అరవింద్ కుమార్, అగస్టీన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బీ వరలే, ఆర్.మహదేవన్, జోయ్మాల్య బాగ్చీ కూడా సభ్యులుగా ఉన్నారు.
శబరిమల అంశంపై వాదనలు
టిడిబి తరఫున అభిషేక్సింగ్వీ మాట్లాడుతూ అయ్యప్పస్వామిని ‘నైష్టిక బ్రహ్మచారి’గా భావించి ఆరాధించే ఏకైక ఆలయం శబరిమల ఆలయమని పేర్కొన్నారు. భక్తులు ఆలయానికి వెళ్లే ముందు 40–41 రోజుల పాటు వ్రతం పాటిస్తారని, దేవుడి స్వరూపంతో సంబంధం ఉండటంతోనే 10 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలకు ప్రవేశం పరిమితం చేశారని ఆయన తెలిపారు. అయితే ఇది మహిళలపై సంపూర్ణ నిషేధం కాదని, 10 సంవత్సరాల లోపు, 50 సంవత్సరాల పైబడిన మహిళలకు ప్రవేశం ఉందని చెప్పారు.
గత తీర్పులు
2018లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మెజారిటీ 4–1 తీర్పుతో 10 నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అయితే 2019లో మరో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశాన్ని మరింత పెద్ద రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. ఈ కేసుపై విచారణ గురువారం కొనసాగనుంది.
