
ములుగు టూరిజంను ప్రపంచానికి చాటేలా 'ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్'
ములుగు జిల్లాలోని అద్భుతమైన పర్యాటక శోభను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త ముందడుగు వేసింది. 99 రోజుల 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' పర్యాటక వారోత్సవాలలో భాగంగా వినూత్నంగా "ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్" నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీలకు సంబంధించిన ప్రణాళికలపై మే 21వ తేదీ (గురువారం) ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా ప్రతినిధులు, ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్త క్రియేటర్లకు ఆహ్వానం
ఈ పోటీలలో ములుగు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా హ్యాండ్లర్స్, మీడియా ప్రతినిధులు పాల్గొనవచ్చు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాలకు కింది విధంగా నగదు బహుమతులు అందజేస్తారు.
• మొదటి బహుమతి: రూ.21,000/-
• ద్వితీయ బహుమతి: రూ.15,000/-
• తృతీయ బహుమతి: రూ.10,000/-
విజేతల వివరాలను జూన్ 2న అధికారికంగా ప్రకటిస్తారు. ఒకవేళ బహుమతి రాకపోయినప్పటికీ, రీల్స్ లోని కంటెంట్ బాగుంటే సదరు క్రియేటర్ల పేర్లతో సహా జిల్లా అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 'కొలాబరేషన్' ద్వారా పబ్లిష్ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
పోటీ నిబంధనలు - గడువు
సమయం:
మే 21 నుంచి మే 30వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల లోపు రీల్స్ సమర్పించాలి.
కంటెంట్:
ములుగు జిల్లా పర్యాటక ప్రాంతాలు, సంస్కృతిపై 4కే క్వాలిటీ వీడియోలను రూపొందించాలి.
సమర్పించే విధానం:
ఆసక్తి గలవారు తమ సొంత పెన్ డ్రైవ్ ద్వారా ములుగు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో నేరుగా అందించవచ్చు.
ఆన్లైన్ ద్వారా:
ఆన్లైన్లో పంపించాలనుకునే వారు డీపీఆర్వో రఫిక్ (99483 92976) లేదా ఏపీఆర్వో వేణు (94949 70535) ల వాట్సాప్ నెంబర్లకు తమ వీడియోలను పంపించవచ్చు.
ఈ వినూత్న పోటీ ద్వారా ములుగు జిల్లా పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, ప్రతిభావంతులైన క్రియేటర్లకు మంచి వేదిక దొరుకుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక, పరిసర ప్రాంతాల కంటెంట్ క్రియేటర్లు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
