
ఉబెర్ కప్లో భారత్ జోరు: ఉక్రెయిన్పై ఘనవిజయం
థామస్&ఉబెర్ కప్-2026 పోరులో భారత యువ మహిళా జట్టు తమ సత్తా చాటింది. ఆదివారం జరిగిన గ్రూప్-ఏ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో ఐరోపా ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత ఉక్రెయిన్ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్లో ఎదురైన పరాజయం నుంచి తేరుకున్న భారత అమ్మాయిలు, ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.
యువ కెరటాల అద్భుత ప్రదర్శన
తొలి సింగిల్స్లో బరిలోకి దిగిన ఉన్నతి హుడా భారత్కు శుభారంభాన్ని అందించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి పొలినా బుహ్రోవాతో జరిగిన హోరాహోరీ పోరులో ఉన్నతి 21-19, 22-20తో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో సింగిల్స్లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ రజత పతక విజేత తన్వీ శర్మ తనదైన శైలిలో ఆకట్టుకుంది. యెవ్హేనియా కాంటెమిర్పై 21-12, 17-21, 21-10తో మూడు సెట్ల పాటు పోరాడి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది.
విజయాన్ని ఖాయం చేసిన దేవిక
ఈ కీలక మ్యాచ్లో టీమ్ మేనేజ్మెంట్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు సింగిల్స్లో విశ్రాంతిని ఇచ్చింది. ఆమె స్థానంలో థాయ్లాండ్ మాస్టర్స్ ఛాంపియన్ దేవిక సిహాగ్కు అవకాశం కల్పించగా, ఆమె ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. మూడో సింగిల్స్లో మరియా స్టోలియారెంకోను 23-21, 21-13తో ఓడించి, భారత్ విజయాన్ని అధికారికంగా ఖాయం చేసింది.
డబుల్స్లో మిశ్రమ ఫలితం
మహిళల డబుల్స్లో భారత్కు స్వల్ప నిరాశ ఎదురైంది. కవిప్రియ సెల్వం - సిమ్రాన్ సింఘి జోడీ 11-21, 17-21తో బుహ్రోవా-కాంటెమిర్ జంట చేతిలో ఓటమి పాలైంది. అయితే చివరి మ్యాచ్లో పీవీ సింధు - తనీషా క్రాస్టో జంట అద్భుతంగా ఆడి స్కోరును 4-1కు చేర్చింది. స్టోలియారెంకో - సోఫియా లావ్రోవా ద్వయాన్ని 21-18, 21-15తో ఓడించి భారత్ జైత్రయాత్రను ముగించింది.
నేడు చైనాతో ఢీ
గ్రూప్ దశలో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో తలపడనుంది. నేడు జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు అత్యంత కీలకం. క్వార్టర్ ఫైనల్కు చేరుకోవాలంటే పటిష్టమైన చైనాను భారత్ తప్పనిసరిగా ఓడించాల్సి ఉంటుంది.
