
గ్యాస్ ధరల ప్రభావం.. ఏపీలో హోటల్ మెనూ ధరలు 10 శాతం పెంపు
వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. పెరిగిన నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని మెనూ ధరలను 10 శాతం వరకు పెంచక తప్పదని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.993 పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్క సిలిండర్ ధర సుమారు రూ.3,315కు చేరింది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఏర్పడిన మార్పుల ప్రభావమే ఈ పెరుగుదలకు కారణమని పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి. స్వామి విడుదల చేసిన ప్రకటనలో, మే 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపు హోటల్, రెస్టారెంట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇప్పటికే ముడి సరుకులు, ఇంధన వ్యయాలు పెరగడంతో హోటల్ యజమానులు నష్టాలను ఎదుర్కొంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో మెనూ ధరలను గరిష్టంగా 10 శాతం వరకు పెంచడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు.
గత మూడు నెలల్లోనే కమర్షియల్ గ్యాస్ ధరలు మొత్తంగా దాదాపు రూ.1,303 మేర పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ఎల్పీజీ వినియోగదారులకే కాకుండా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగించే సంస్థలపై కూడా అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. హోటల్ రంగంలో గ్యాస్ ప్రధాన ఇంధనంగా ఉండటంతో ధరల పెరుగుదల రోజువారీ నిర్వహణను కష్టతరం చేస్తోందని స్వామి అన్నారు. మరోవైపు వంటనూనెలు, ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరగడం, పప్పులు, కూరగాయల ధరలు రికార్డు స్థాయికి చేరడం వల్ల వ్యయభారం మరింత అధికమైందని తెలిపారు.
టేక్అవే, హోమ్ డెలివరీ సేవలకు ఉపయోగించే ప్యాకేజింగ్ సామగ్రి ధరలు కూడా నిరంతరం పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీంతో హోటల్ రంగంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హోటల్ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పన్ను రాయితీలు లేదా సబ్సిడీలు అందించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నాణ్యతలో రాజీ పడకుండా సేవలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న హోటల్ యజమానుల పరిస్థితిని వినియోగదారులు అర్థం చేసుకుని సహకరించాలని కూడా కోరింది.
