

మెట్రో ఫేజ్-2కు అనుమతులు ఇవ్వండి: కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు నెట్వర్క్ విస్తరణే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. కృష్ణ మీనన్ మార్గ్లోని కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఏడు కారిడార్లు.. 122.9 కిలోమీటర్ల విస్తరణ
మెట్రో రెండో దశలో భాగంగా మొత్తం ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మార్గాలను ప్రతిపాదించామని, దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఫేజ్-3 ప్రతిపాదనలు..
ఇదే సమావేశంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐ) నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఉండే కారిడార్ను మెట్రో మూడో దశగా చేపట్టాలని, దీని డీపీఆర్ను కూడా పరిశీలించాలని ఖట్టర్ను కోరారు.
మరో కీలక అంశంగా, మెట్రో మొదటి దశను ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ గురించి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ ప్రాజెక్టులు ఎటువంటి ఆటంకాలు లేకుండా, వేగంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నియంత్రణలోకి రావడంతో రాబోయే పనులకు పునాదులు పటిష్టంగా పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్సీఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణ ద్వారా నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
