Let's talk: editor@tmv.in
నల్గొండ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

నల్గొండ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

Gaddamidi Naveen
16 ఏప్రిల్, 2026

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నగరంలోని కీలక మౌలిక వసతుల పనులను సమీక్షిస్తూ శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నల్గొండ ఫ్లైఓవర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన, చీఫ్ ఇంజనీర్, జోనల్ కమిషనర్‌లతో కలిసి నగరంలోని మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు చేపట్టిన ప్రాజెక్టులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తన పర్యటనలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శాస్త్రీపురం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తిగా పూర్తయ్యాయని, ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కమిషనర్ ప్రకటించారు. వంతెనను పటిష్టంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు సరైన నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇక నల్గొండ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన డెక్ స్లాబ్ కాంక్రీట్ పనులు, అప్ అండ్ డౌన్ ర్యాంప్‌ల కోసం గిర్డర్ ఎరెక్షన్, ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని, పనులను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా వీక్లీ రివ్యూలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం, సురక్షితం కానుంది.