
వార్షిక ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026కు దరఖాస్తులు ఆహ్వానించిన ఎఫ్టీసీసీఐ
108 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్టీసీసీఐ, 2026 సంవత్సరానికి గాను తమ వార్షిక ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తల నుంచి మొత్తం 21 విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
పరిశ్రమలు, ఆవిష్కరణలే కాకుండా.. సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులు, సామాజిక వ్యవస్థాపకత వంటి విభిన్న రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందజేస్తారు. స్వతంత్ర జ్యూరీ ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు ఆర్. రవికుమార్ తెలిపారు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేశామని, ఇప్పటికే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైందని ఆయన తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 10గా నిర్ణయించారు.
అవార్డుల ప్రదానోత్సవం మే 22న నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని అవార్డులు ప్రదానం చేసే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది 200 దరఖాస్తులు రాగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. 1974లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం తెలంగాణలో వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడమేనని అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు సరళీకరించిన ఆన్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
