Let's talk: editor@tmv.in
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి!
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి!
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి!

ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి!

Shaik Mohammad Shaffee
29 ఏప్రిల్, 2026

ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెకాసి తైమూర్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న లోకల్ ట్రెయిన్‌ను వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటనలో మరో 84 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు మంగళవారం ఉదయానికి ముగిశాయి.

అసలేం జరిగింది?

స్థానిక రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత బెకాసి తైమూర్ స్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ వద్ద ఒక టాక్సీ పట్టాలపై నిలిచిపోయిన లోకల్ ట్రెయిన్‌ను స్వల్పంగా తాకింది. దీంతో సాంకేతిక కారణాల దృష్ట్యా ఆ లోకల్ ట్రెయిన్‌ను అధికారులు ట్రాక్‌పైనే నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో, జకార్తా నుంచి సురబాయా వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు 'అర్గో బ్రోమో అంగ్‌గ్రెక్‌' పట్టాలపై ఆగి ఉన్న లోకల్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

మహిళా కోచ్‌లోనే భారీ ప్రాణ నష్టం

ఈ ప్రమాదంలో లోకల్ ట్రెయిన్‌లోని చివరి కోచ్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఇండోనేషియాలో సాధారణంగా లోకల్ రైళ్లలో చివరి బోగీని 'మహిళా స్పెషల్' కోచ్‌గా కేటాయిస్తారు. ప్రమాద తీవ్రత అంతా ఈ బోగీపైనే పడటంతో మృతి చెందిన 15 మంది మహిళలేనని అధికారులు వెల్లడించారు. ఎక్స్‌ప్రెస్ రైలులో ఉన్న 240 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

సహాయక చర్యలు వేగవంతం

ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. బోగీలు తీవ్రంగా దెబ్బతినడం, ఇనుప ముక్కలు ఒకదానికొకటి పెనవేసుకోవడంతో బాధితులను బయటకు తీయడం గగనంగా మారింది. యాంగిల్ గ్రైండర్లను ఉపయోగించి ఇనుప రేకులను కట్ చేసి క్షతగాత్రులను వెలికితీశారు. మంగళవారం ఉదయానికి శిథిలాల నుంచి అందరినీ బయటకు తీశామని, ఇక ఎవరూ లోపల చిక్కుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. గాయపడిన 84 మందిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

విచారణకు ఆదేశం

రైల్వే వ్యవస్థ పాతబడటం, సాంకేతిక లోపాలు ఇండోనేషియాలో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. లోకల్ ట్రెయిన్ ఆగి ఉన్న సమాచారం ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్‌కు ఎందుకు చేరలేదనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

గతంలోనూ ఘోర ప్రమాదాలు

ఇండోనేషియా రైల్వే చరిత్రలో ఇటువంటి ఘటనలు కొత్తేమీ కాదు. 2010లో సెంట్రల్ జావాలో జరిగిన ఇలాంటి ప్రమాదంలోనే 36 మంది మరణించారు. ఈ ఏడాది జనవరిలో వెస్ట్ జావాలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.