
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం ఎలా జరిగింది
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రమండ్గంజ్ లోయ నుంచి లసోడా వైపు దిగువకు వస్తున్న ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయి ముందు వెళ్తున్న మరో ట్రక్ను ఢీకొట్టింది. ఈ రెండు ట్రక్కుల మధ్యలో వెళ్తున్న కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అదే సమయంలో మరో కారు కూడా ఢీకొనడంతో అగ్నికి ఆహుతైంది. ఈ చైన్ యాక్సిడెంట్ కారణంగా భారీ ప్రాణనష్టం జరిగింది.
విచారణ ప్రారంభం
మృతుల్లో మీర్జాపూర్కు చెందిన 7 మంది, మధ్యప్రదేశ్కు చెందిన 3, సోన్భద్ర జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. మృతదేహాలను మార్చురీకి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
