
24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. జూన్ 18న పోలింగ్!
దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెలలో పదవీ కాలం పూర్తి చేసుకోనున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ వంటి ప్రముఖ ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చెరో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మూడు చొప్పున.. జార్ఖండ్లో రెండు స్థానాలు.. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలలో ఒక్కో రాజ్యసభ స్థానం చొప్పున ఖాళీ కానున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
ఈ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను జూన్ 1వ తేదీన జారీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ. 9న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. అనంతరం జూన్ 18వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు (జూన్ 18న) ఓట్ల లెక్కం పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తారు.
మహారాష్ట్ర, తమిళనాడులలో ఉపఎన్నికలు
ద్వైవార్షిక ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక్కో రాజ్యసభ స్థానానికి కూడా ఉపఎన్నిక జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ సి.వి. షణ్ముగంలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన రెండు ఖాళీలకు కూడా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో పాటే, అంటే జూన్ 18వ తేదీనే ఉపఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని స్థానాన్ని ఎన్డీయే సులభంగా గెలుచుకోనుండగా, తమిళనాడులోని ఏకైక స్థానాన్ని టీవీకే కైవసం చేసుకునే అవకాశం ఉంది.
సీట్ల సమీకరణాలు - ప్రస్తుత బలాబలాలు
ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఈ 26 స్థానాలలో ఎన్డీయేకు 18, కాంగ్రెస్కు 4, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు 1, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు ఉన్నాయి.
రాబోయే ఫలితాల అంచనా:
ఈ ఎన్నికల తర్వాత ఎన్డీయేకు 17 స్థానాలు, కాంగ్రెస్కు 5, జేఎంఎంకు 2, తమిళనాడుకు చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి 1 స్థానం దక్కే అవకాశం ఉంది.
మొత్తం సభలో బలం:
244 మంది సభ్యులు గల ఎగువ సభలో (రాజ్యసభ) ప్రస్తుతం ఎన్డీయేకు 149 మంది ఎంపీలు, ప్రతిపక్షాలకు 78 మంది, ఏ కూటమిలోనూ లేని ప్రాంతీయ పార్టీలకు 17 మంది ఎంపీలు ఉన్నారు.
వివిధ రాష్ట్రాల్లో అంచనాలు
ఆంధ్రప్రదేశ్ & గుజరాత్: ఆంధ్రప్రదేశ్లోని నాలుగు స్థానాలనూ అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) క్లీన్ స్వీప్ చేయనుంది. గుజరాత్లోని నాలుగు స్థానాలనూ బీజేపీ సొంతం చేసుకోనుంది. జార్ఖండ్లో ఇక్కడి 2 స్థానాలను జేఎంఎం-కాంగ్రెస్ కూటమి గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, 21 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. ప్రతిపక్షాల నుంచి క్రాస్ ఓటింగ్ ద్వారా ఒక స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ మూడు స్థానాలను, బీజేపీ కేవలం ఒక స్థానాన్ని గెలుచుకోనున్నాయి. ఇకా మధ్యప్రదేశ్ & రాజస్థాన్లలో ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బలాన్ని బట్టి బీజేపీ చెరో రెండు స్థానాలు, కాంగ్రెస్ చెరో ఒక స్థానాన్ని గెలుచుకోనున్నాయి.
రాజస్థాన్ అసెంబ్లీ సమీకరణాలు
మొత్తం 10 రాజ్యసభ స్థానాలున్న రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్లకు ఐదేసి మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అవుతున్న 3 స్థానాలలో.. 200 మంది సభ్యులున్న అసెంబ్లీ బలాన్ని బట్టి బీజేపీ రెండు స్థానాలను, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకోనున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 118 మంది, కాంగ్రెస్కు 67 మంది, బీఎస్పీకి ఇద్దరు, భారత్ ఆదివాసీ పార్టీకి నలుగురు, ఆర్ఎల్డీకి ఒకరు, స్వతంత్రులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎగువ సభలో పలు రాష్ట్రాల బలాబలాలు మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
