Let's talk: editor@tmv.in
టీఎంసీ ఎంపీ కారుపై దాడి..నివేదిక కోరిన ఈసీఐ

టీఎంసీ ఎంపీ కారుపై దాడి..నివేదిక కోరిన ఈసీఐ

Pinjari Chand
28 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అరంబాఘ్ నియోజకవర్గానికి చెందిన టీఎంసీ ఎంపీ మితాలి బాగ్‌ తన కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఎంపీ మితాలి బాగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ సభకు వెళ్తుండగా హుగ్లీ జిల్లా గోగాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ అభ్యర్థి కార్యాలయం దగ్గర కొందరు దుండగులు రాళ్లు విసరడంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. తాను ఒక దళిత మహిళనని పేర్కొంటూ ‘లాఠీలు పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు మా వాహనాన్ని అడ్డుకుని దాడి చేశారు’ అని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో తనకు గాజు ముక్కలు తగిలి గాయపడినట్లు తెలిపారు. ఆమె స్థానిక ఆసుపత్రికి వైద్య నిమిత్తం వెళ్లారు. మరోవైపు, టీఎంసీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, మహిళా ఎంపీపై దాడి జరిగిందని పేర్కొంది. పార్టీ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ, ఈ ఘటనకు ప్రజలు ఓటుతో సమాధానం ఇస్తారని అన్నారు.

నివేదిక కోరిన ఈసీఐ

ఈ ఘటనపై స్పందించిన ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ), వెంటనే నివేదిక కోరింది. సంఘటన స్థలంలో కేంద్ర భద్రతా దళాలు మోహరించామని అధికారులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఎంపీ చేసిన ఫేస్‌బుక్ లైవ్ వీడియోలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, బీజేపీ నేతలు ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. టీఎంసీ కార్యకర్తలే బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని, దాన్ని దాచిపెట్టేందుకు మితాలి బాగ్ నాటకమాడుతున్నారని బీజేపీ ప్రతినిధి డెబ్జిత్ సర్కార్ ఆరోపించారు. అదే సమయంలో, బీజేపీ స్థానిక మాజీ అధ్యక్షుడు బిమాన్ ఘోష్ కూడా తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, దాదాపు 50 మంది గాయపడ్డారని ఆరోపించారు. అయితే టీఎంసీ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, బీజేపీ కార్యకర్తలే మొదట దాడికి దిగారని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, భారీ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 29న జరగనున్న రెండో దశ పోలింగ్ నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.