Let's talk: editor@tmv.in
దేవుడిని తాకనివ్వకపోతే రాజ్యాంగం రక్షణ కల్పించదా?: సుప్రీంకోర్టు

దేవుడిని తాకనివ్వకపోతే రాజ్యాంగం రక్షణ కల్పించదా?: సుప్రీంకోర్టు

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

భక్తుడికి దేవుడిని తాకకుండా ఆపితే రాజ్యాంగం రక్షణ కల్పించదా అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను లేవనెత్తింది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న ఆచారాలపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళలపై అధ్యాత్మిక స్థలాల్లో జరుగుతున్న వివక్ష, మత స్వేచ్ఛ పరిమితులపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. విచారణలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వి. గిరి మాట్లాడుతూ, ప్రతి ఆలయంలోని ఆచారాలు, సంప్రదాయాలు ఆ మతానికి అంతర్భాగమని తెలిపారు. భక్తుడు ఆలయానికి వెళ్లినప్పుడు దేవత లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదని అన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా ప్రశ్నిస్తూ నేను పూర్తిగా విశ్వాసంతో దేవాలయానికి వెళ్తాను. అయితే జననం, వంశం లేదా ఇతర కారణాల వల్ల దేవుడిని తాకనివ్వరని చెబితే, అప్పుడు రాజ్యాంగం రక్షణ ఇవ్వదా? అని వ్యాఖ్యానించారు. సృష్టికర్త–సృష్టి మధ్య భేదం ఉండకూడదని కూడా పేర్కొన్నారు. ఇదే సమయంలో, పూజారి పదవిపై పూర్తిగా నిషేధం విధిస్తే, అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద లేకుంటే రాష్ట్రం జోక్యంతో పరిష్కరించవచ్చని గిరి తెలిపారు.

శబరిమల ఆలయంలోని దేవుడు ‘నైష్టిక బ్రహ్మచారి’ (శాశ్వత బ్రహ్మచారి)గా భావించబడతారని, అందుకు అనుగుణంగానే అక్కడి ఆచారాలు కొనసాగుతున్నాయని ఆయన వాదించారు. మహిళలు ప్రవేశించడంపై ఉన్న పరిమితులు కూడా ఆ ఆచారాల భాగమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మతపరమైన ఆచారాలు కూడా న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు ఇటీవలే వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు వ్యక్తిగత మత విశ్వాసాలకు అతీతంగా రాజ్యాంగ పరిమితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని తెలిపింది. గతంలో 2018లో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ 4:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో, 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. ఆ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. తర్వాత 2019లో మరో బెంచ్ ఈ అంశాన్ని విస్తృత పరిశీలన కోసం పై బెంచ్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.