

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, అష్టోత్తర శతనామార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై కొలువై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. పానకాల స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు పానకాన్ని నైవేద్యంగా అర్పించారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్కు వేదాశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భక్తిపూర్వకంగా పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎంకి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో హాజరయ్యారు. పవన్ వెంట రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్తో పాటు తదితరులు ఉన్నారు.
