Let's talk: editor@tmv.in
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

Gaddamidi Naveen
2 మే, 2026

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన బి. శివధర్ రెడ్డి స్థానంలో ఆనంద్ నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సమీక్ష

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న 'ఫోన్ ట్యాపింగ్' కేసుపై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు దర్యాప్తును స్వయంగా సమీక్షిస్తానని, త్వరలోనే రెండో చార్జిషీటు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, రోడ్డు ప్రమాదాలపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి ఏటా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కేవలం హైదరాబాద్ ప్రాంతంలోనే రోజుకు 1,600 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, 'ఈగల్' ఫోర్స్ తరహాలోనే, రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరచడానికి 'ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో'ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

నేర నియంత్రణలో కృత్రిమ మేధ (ఏఐ)

మారుతున్న కాలానికి అనుగుణంగా నేర పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తామని ఆనంద్ తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు కఠినమైన పోలీసింగ్‌తో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నక్సలిజం పునరుద్ధరణకు అవకాశం లేదని, లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. గోవధ చట్టాల అమలుపై స్పందిస్తూ.. పోలీసులు మాత్రమే ఈ అంశాన్ని డీల్ చేస్తారని, దీని కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

సీవీ ఆనంద్ ప్రస్థానం

1991 బ్యాచ్‌కు చెందిన సి.వి. ఆనంద్, డీజీపీగా నియమితుడవ్వడానికి ముందు హోం శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వరంగల్ రూరల్ ఏఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. మొదటి తొమ్మిదేళ్లు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. అనేక ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న ఆయన సాహసోపేత చర్యలకు గాను రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్ అందుకున్నారు. గతంలో ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆయన 2028జూన్‌ వరకు డీజీపీగా కొనసాగనున్నారు. పదవీ విరమణ చేసిన బి. శివధర్ రెడ్డిని ప్రభుత్వం రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించింది.