Let's talk: editor@tmv.in
రాహుల్ గాంధీని ‘ప్రధాని’ చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీని ‘ప్రధాని’ చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
19 మే, 2026

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానమంత్రిగా చూడటమే తమ అందరి అతిపెద్ద ఉమ్మడి లక్ష్యమని, దీనిని సాధించడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు అంతా కలిసికట్టుగా కృషి చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు.

కేరళ నూతన ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో పాటు పలువురు అగ్రనేతలను రేవంత్ రెడ్డి కలుసుకున్నారు.

ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో పంచుకుంటూ భావోద్వేగంగా స్పందించారు. కేరళలో నాయకులంతా ఒకచోటికి చేరడం "స్నేహితులు, సహచరుల పునఃకలయికలా" అనిపించిందని పేర్కొన్నారు. ఇక్కడి వాతావరణంలో కొత్త ఆశ, శక్తి, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ ఉమ్మడి లక్ష్యం మాలోని శక్తిని మరింత బలపరుస్తుందని ఆయన రాసుకొచ్చారు.

ఘనంగా సతీశన్ ప్రమాణ స్వీకారం

తిరువనంతపురంలో జరిగిన వేడుకలో కేరళ ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు వామపక్ష నేతలు, బీజేపీ ప్రతినిధులు హాజరయ్యారు.