
సర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావితం చేస్తోంది: బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓటర్ల సవరణ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆయన ఆరోపించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జరుగుతున్న పలు అక్రమాలు, లోపాలను తాము ఇప్పటికే తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి (సీఈఓ) దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితాల సవరణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమంగా దేశంలోకి చొరబాటుదారుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. అలాంటి పేర్లను గుర్తించి తొలగించేలా ఎన్నికల సంఘం సరైన విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని, రాజకీయ జోక్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేయనున్నారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ జరుగుతుంది. అన్ని దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
