Let's talk: editor@tmv.in
పంజాబ్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. 117 నియోజకవర్గాల్లో యాత్రలు

పంజాబ్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. 117 నియోజకవర్గాల్లో యాత్రలు

Gaddamidi Naveen
10 మే, 2026

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున 'యాత్రలు' నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు.

పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భూపేష్ బఘేల్ శనివారం చండీగఢ్‌లో జరిగిన పార్టీ మేధోమధన సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలోనూ మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని, ప్రజల అంచనాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. యాత్రల ముగింపు కార్యక్రమాలకు పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా హాజరవుతారని తెలిపారు.

రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒక ఛార్జిషీట్ విడుదల చేయనుందని బఘేల్ ప్రకటించారు. పంజాబ్‌లో పెరిగిన‌ అవినీతి, క్షీణిస్తున్న శాంతిభద్రతల వల్ల సామాన్య ప్రజలు అభద్రతకు లోనవుతున్నారని ఆయన విమర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆప్ పార్టీలు కలిసి పంజాబ్ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తారు తప్ప, వారిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పంజాబ్ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఈ యాత్రలు అత్యంత కీలకం కానున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది.