
మీనాక్షి నటరాజన్ ఓటమి వెనుక కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుట్రలు, నాయకత్వ లోపాలు, పరిపాలనా వైఫల్యాలు ఆ పార్టీ అసలు స్వరూపాన్ని తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు, ఆమె ఓటమికి కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తమ సొంత ద్రోహాలు, ముఠా రాజకీయాల వల్ల జరిగిన ఈ తప్పులోకి రాజకీయ ప్రత్యర్థులను లాగడానికి కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు.
మీనాక్షి నటరాజన్ పై ఉన్న కేసుల వివరాలను కాంగ్రెస్లోనే ఉంటూ బీజేపీ నాయకులకు ఎవరు లీక్ చేశారనే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందాలను (సిట్) ఏర్పాటు చేయడం అంత ఇష్టమైతే.. ఈ అంతర్గత లీకేజీ వ్యవహారంపై కూడా సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని లోపలి నుంచే నిర్వీర్యం చేస్తున్న ఆ "బ్లాక్ షీప్" రాహుల్ గాంధీ గుర్తించాలని సూచించారు. అంతర్గత కుట్రల చరిత్ర కాంగ్రెస్కు కొత్తది కాదని, పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పనిచేస్తున్నారని ఆరోపించారు.
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా కేటీఆర్ ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్ కి అన్యాయం జరిగింది. ఎన్నికల సంఘం ఆమె పట్ల తప్పుగా వ్యవహరించింది. జార్ఖండ్లో ఒకదానికి అనుమతించి, ఇటు మీనాక్షి పిటిషన్ను తిరస్కరించడం ముమ్మాటికీ తప్పే. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు చేశారనే నివేదికలు వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ కూడా ఆమెకు ద్రోహం చేసిందనేది వాస్తవం అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పదవిపై వ్యాఖ్యలు
పెద్ద పదవులను కాంగ్రెస్ పార్టీ డబ్బుకు అమ్ముకుంటుందంటూ ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అందరికీ తెలిసిన నిజాన్నే ఆయన మాట్లాడారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బుకు పదవులు అమ్ముకునే సుదీర్ఘ చరిత్ర ఉందన్న ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆర్థిక, రాజకీయ ఒప్పందాల ద్వారానే ఆ పదవిని దక్కించుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ఒక రిన్యూవల్ ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్ హైకమాండ్ను సంతృప్తి పరచడం పైనే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఆధారపడి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, తెలంగాణలో ప్రభుత్వ పనితీరు పూర్తిగా ఫెయిల్యూర్ దిశలో ఉందని విమర్శలు గుప్పించారు.
కాగా, మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం దానిని కొట్టివేసిన సంగతి తెలిసిందే.
