Let's talk: editor@tmv.in
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మజ్లిస్ పార్టీతో చేతులు కలిపాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మజ్లిస్ పార్టీతో చేతులు కలిపాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
27 జూన్, 2026

తెలంగాణలో సాగుతున్న ‘ప్రత్యేక ఓటర్ల జాబితా ముమ్మర సవరణ’ (స‌ర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, దానికి అనుగుణంగానే పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురువారం అత్యంత పారదర్శకంగా ప్రారంభమైందని తెలిపారు. అయితే, తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత అధికారులపైనే సీఎంకు నమ్మకం లేదా?

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వ యంత్రాంగమే ఈ ప్రక్రియను నిర్వహిస్తుంటే, ముఖ్యమంత్రే దీనిని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇతర ప్రభుత్వ అధికారులే క్షేత్రస్థాయిలో ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రికి తన సొంత అధికారులపైనే నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నారు. ఆయన మజ్లిస్ పార్టీ నేతలతో అర్ధరాత్రి సమావేశాలు నిర్వహిస్తూ.. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపును నిరసించాలంటూ, అధికారులను కాలనీల్లోకి రానివ్వద్దంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని జి. కిషన్ పేర్కొన్నారు.

అంతకుముందు గురువారం ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉందన్న ఆయన.. తుది ఎస్‌ఐఆర్ జాబితాలో పేరు లేకపోతే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర హోం శాఖకు ఆ పేర్లు వెళ్తాయని, తద్వారా పౌరసత్వంపైనే ప్రశ్నలు తలెత్తుతాయని ఓటర్లను హెచ్చరించారు. పత్రాల సమర్పణ సాధారణ ఓటర్లకు భారంగా మారిందన్నారు. అయితే, తమ విజ్ఞప్తిని మన్నించి రాష్ట్రంలో 'మీసేవ' కేంద్రాల సంఖ్యను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ గత రెండు నెలలుగా లక్షలాది మందికి 2002 నాటి ఓటరు వివరాలను మ్యాపింగ్ చేయడంలో సహాయపడుతోందని ఓవైసీ వివరించారు.

ఎస్‌ఐఆర్ గడువులు

తెలంగాణలో జూన్ 25 (గురువారం) నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుండగా, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

మరోవైపు, బుధవారం నాటి జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేద ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదంతా కేవలం మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలని కిషన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

ట్యాగ్‌లు
KishanReddyBJPCongressBRSAIMIMOwaisiRevanthReddyTelanganaSIRVoterListElectionCommissionTelanganaPoliticsPoliticalNewsBreakingNews
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మజ్లిస్ పార్టీతో చేతులు కలిపాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - Tholi Paluku