
నెల రోజుల్లో ‘రీ-నీట్’ నిర్వహణ సవాల్: ఎన్టీఏ
జూన్ 21న జరగనున్న 'రీ-నీట్' పరీక్షకు నెల రోజులలోపు సమయం మాత్రమే ఉండటంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అత్యంత అప్రమత్తమైంది. గత నీట్-యూజీ పరీక్షలో తలెత్తిన పేపర్ లీకేజీ ఆరోపణలు, అవకతవకల నేపథ్యంలో.. ఈసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఎన్టీఏ పూర్తి నిఘా, పకడ్బందీ ఆడిట్లు, సోషల్ మీడియా పర్యవేక్షణతో కూడిన ‘జీరో ట్రస్ట్’ విధానాన్ని అమలు చేస్తోందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా ఇంతటి భారీ స్థాయి పరీక్షల నిర్వహణకు దాదాపు ఆరు నెలల ముందస్తు సన్నద్ధత అవసరమని, అయితే కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఈ పునఃపరీక్షను పూర్తి చేయడం అనేది ఒక పెద్ద లాజిస్టికల్ సవాలు అని ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. సమయం చాలా తక్కువగా ఉందని, ఈ తక్కువ వ్యవధిలో ఏ చిన్న తప్పు జరిగినా అది పెద్ద విపత్తుగా మారుతుందని ఓ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాపై నిఘా
గత పరీక్షపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం, ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతుండటంతో ఎన్టీఏ తన అంతర్గత భద్రతా పద్ధతులను పూర్తిగా మార్చేసింది. మేము అన్ని నిబంధనలను బలోపేతం చేశాము. క్రాస్-చెకింగ్ విధానాలను పెంచాము. పరీక్షా పారదర్శకత కోసం తీసుకుంటున్న అన్ని చర్యలను బహిరంగంగా వెల్లడించలేము, ఎందుకంటే అది పేపర్ లీక్ మాఫియాకు లూప్హోల్స్ వెతుక్కోవడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. లీకేజీకి ఉపయోగపడిందని అనుమానిస్తున్న టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను ఏజెన్సీ నిశితంగా పరిశీలిస్తోంది.
వ్యవస్థలోని లోపాలపై స్పందన
కొన్నేళ్లుగా సంస్థతో కలిసి పనిచేస్తున్న ఉపాధ్యాయులు లేదా సిబ్బంది వంటి అంతర్గత వ్యక్తులే ద్రోహులుగా మారి తప్పు చేస్తే, దానిని అడ్డుకోవడం అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని ఎన్టీఏ అంగీకరించింది. అయితే ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూస్తున్నామని తెలిపింది. గతంలో జరిగిన లీకేజీని విశ్లేషిస్తూ.. ప్రింటింగ్ ప్రెస్లు, బ్యాంకులు లేదా పరీక్షా కేంద్రాల నుంచి లీక్ జరిగి ఉంటే పూర్తి పేపర్ బయటకు వచ్చేదని, కానీ అప్పుడు కేవలం ఒక భాగం మాత్రమే లీక్ అయిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ దర్యాప్తును ఎన్టీఏ ఎలాంటి ప్రభావితం చేయలేదని, పూర్తి నిజాలు విచారణలోనే వెల్లడవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎన్టీఏ విద్యార్థులను పదే పదే నిరాశపరచలేదు, అది వారికి న్యాయం కాదు. మేము చేస్తున్న కసరత్తు ఏంటనేది జూన్ 21న రుజువు అవుతుందని ఎన్టీఏ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.
