Let's talk: editor@tmv.in
కేరళలో యూడీఎఫ్ ఘనవిజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం

కేరళలో యూడీఎఫ్ ఘనవిజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం

Gaddamidi Naveen
5 మే, 2026

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడీఎఫ్) సాధించిన చారిత్రాత్మక విజయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర సీనియర్ నేతలకు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ చారిత్రాత్మక విజయం సాధించడంలో దిశానిర్దేశం చేసిన మన నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్మున్షీకి కాంగ్రెస్ శ్రేణుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అని రేవంత్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

కేరళలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి, తనపై అపారమైన ప్రేమను కురిపించిన కేరళ ప్రజలకు, యూడీఎఫ్ మద్దతుదారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా, నా ప్రచార సమయంలో నన్ను ఆదరించిన కేరళ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను విశ్వసించే గొప్ప రాష్ట్రాలని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలం నాటి నిరాశ, ద్రోహం తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ హయాంలో ఉజ్వల భవిష్యత్తు వైపు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రచార సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఏప్రిల్ 1న జరిగిన సభలో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన 'నరసింహం' చిత్రంలోని ప్రసిద్ధ డైలాగ్ "నీ పో మోనే దినేశా"ను ఆయన ప్రయోగించారు. దానిని "నీ పో మోనే విజయా" (వెళ్లిపో విజయ్) అని మార్చి చెప్పడంతో జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విజయన్ సమయం ముగిసిందని, ఆయన 'ఎక్స్‌పైరీ డేట్' దాటిపోయిందని రేవంత్ విమర్శించారు.

దీనికి పినరయి విజయన్ కూడా అదే స్థాయిలో స్పందించారు. రేవంత్‌ను ఉద్దేశించి మలయాళంలో కఠిన పదజాలం వాడటంతో ఇద్దరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అయితే, తుది ఫలితాలు యూడీఎఫ్‌కు అనుకూలంగా రావడంతో రేవంత్ రెడ్డి వర్గంలో ఉత్సాహం నెలకొంది.

కేరళ విజయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన 'ఎక్స్' వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కేరళ సోదర సోదరీమణులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

కేరళ ప్రజలు దూరదృష్టి, పురోగతి, యూడీఎఫ్ యొక్క అలుపెరుగని పోరాట పటిమను ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో, కార్యకర్తల కృషితో కేరళ రాష్ట్రం సమగ్ర వృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆకాంక్షించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, బలమైన, సంపన్నమైన భారతదేశం కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.