
‘ఈగల్ 1972’ పోస్టర్లు ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్బంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 'యోగాంద్రా' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘ఈగల్ 1972’ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ వేదికపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యోగాంద్రా కార్యక్రమం అనంతరం, ముఖ్యమంత్రి బ్రాహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రూపొందించిన 'వ్యసనముక్త భారత అభియాన్' ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈగల్ సేవలకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
ఈగల్ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా భద్రత, అవగాహన కార్యక్రమాల గురించి ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. ఈగల్ సంస్థ సమాజ హితం కోసం చేపడుతున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు, విశేష సేవలను తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐజీపీ ఆకే రవికృష్ణని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత చేరువయ్యేలా, సమాజానికి మేలు జరిగేలా తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచిస్తూ ఈగల్ బృందాన్ని సీఎం అభినందించి ప్రోత్సహించారు. వేలాది మంది ప్రజలు, యువత, యోగా సాధకుల భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిసిన ఈ వేదికపై 'ఈగల్1972' పోస్టర్ల ఆవిష్కరణ జరగడం ఈగల్ సంస్థకు మరింత గుర్తింపును తీసుకువచ్చింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, పలువురు శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
