Let's talk: editor@tmv.in
పిల్లలు భారం కాదు.. కుటుంబానికి సంపద: సీఎం చంద్రబాబు

పిల్లలు భారం కాదు.. కుటుంబానికి సంపద: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
29 జూన్, 2026

జాతీయ రోగనిరోధక దినోత్సవ సంద‌ర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, రాష్ట్రవ్యాప్త ‘పల్స్ పోలియో’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, పిల్లలను భారంగా కాకుండా కుటుంబానికి సంపద, శ్రేయస్సుకు మూలంగా భావించే దృక్పథం పెంపొందాలని అన్నారు. పిల్లల జననం, పెంపకం, సంరక్షణ బాధ్యత కేవలం తల్లులదే కాదని, తండ్రులు కూడా సమాన బాధ్యత తీసుకోవాలని సూచించారు. కుటుంబంలోని పురుషులు పిల్లల పెంపకంలో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తాతలు, అమ్మమ్మలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషించేవారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటి కుటుంబ వ్యవస్థ పిల్లల్లో విలువలు, సంస్కారాలు పెంపొందించడంలో ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరించబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పిల్లలను భారంగా చూసే ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం, కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రభుత్వం ప్రస్తుతం ప్రోత్సహిస్తోందని, ఈ విషయమై తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చేందుకు చురుగ్గా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వం అందించే రోగనిరోధక టీకాలన్నింటినీ షెడ్యూల్ ప్రకారం పిల్లలకు ఇప్పించాలని ఆయన కోరారు.

ఈ మూడు రోజుల పల్స్ పోలియో ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న దాదాపు 50 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
ChandrababuNaiduAndhraPradeshPulsePolioPolioDriveNationalImmunisationDayChildHealthVaccinationPublicHealth
పిల్లలు భారం కాదు.. కుటుంబానికి సంపద: సీఎం చంద్రబాబు - Tholi Paluku