Let's talk: editor@tmv.in
‘చార్‌‌ధామ్’ సాంస్కృతిక వైభవానికి ప్రతీక: ప్రధాని మోడీ
‘చార్‌‌ధామ్’ సాంస్కృతిక వైభవానికి ప్రతీక: ప్రధాని మోడీ

‘చార్‌‌ధామ్’ సాంస్కృతిక వైభవానికి ప్రతీక: ప్రధాని మోడీ

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్న సందర్భంగా ‘చార్ ధామ్’ యాత్రను భారత నిత్య విశ్వాసం, ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాల మహోత్సవంగా అభివర్ణించారు. ఇలాంటి యాత్రలు దేశ ఆధ్యాత్మిక చైతన్యాన్ని, నిత్య వారసత్వాన్ని మనకు చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా, యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ హిందీలో ప్రత్యేక లేఖ రాశారు. చార్ ధామ్ యాత్ర హిందువుల పవిత్ర క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి దర్శనాలతో కూడుకున్నదని తెలిపారు.

ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరుచుకున్నాయని, బుధవారం కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభమైందని, ఏప్రిల్ 23న బద్రీనాథ్ ద్వారాలు కూడా భక్తులకు తెరుచుకోనున్నాయని పేర్కొన్నారు. జగద్గురు ఆది శంకరాచార్య బద్రీనాథ్, కేదార్‌నాథ్ యాత్రల ద్వారా భారత సంస్కృతికి కొత్త దిశ చూపారని, అలాగే జగద్గురు రామానుజాచార్య, జగద్గురు మాధ్వాచార్య కూడా బద్రీనాథ్‌ను సందర్శించి తమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను సమృద్ధి చేశారని పేర్కొన్నారు.

హిమాలయాల ఒడిలో ఉన్న ఈ నాలుగు క్షేత్రాలు ప్రజల నిత్య విశ్వాసానికి కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు. భాషలు, సంప్రదాయాలు, సంస్కృతులు భిన్నమైన ప్రజలు ఇక్కడికి చేరి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనను మరింత బలపరుస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్, అభివృద్ధి చెందిన భారత లక్ష్యానికి కీలకమన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఉత్తరాఖండ్‌లో జరిగిన అభివృద్ధి వల్ల చార్ ధామ్ యాత్ర మరింత సులభం, సురక్షితం, ఆధ్యాత్మికంగా మారిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

యాత్రికులు ‘డిజిటల్ ఫాస్టింగ్’ పాటిస్తూ ఉత్తరాఖండ్ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని సూచించారు.

యాత్రికులు ఐదు సంకల్పాలు చేయండి

• ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండడం

• హిమాలయ ప్రాంతం పట్ల సున్నితత్వం చూపిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం

• సేవ, సహకారం, ఐక్యతకు ప్రాధాన్యం

• ‘వోకల్ ఫర్ లోకల్’—యాత్ర ఖర్చులో కనీసం 5% స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు కేటాయించడం

• నియమాలు, భద్రతా సూచనలు పాటించడం

ఇటీవల చార్ ధామ్‌కు కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, ఉత్తరాఖండ్‌లోని చిన్నచిన్న సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయాలని మోడీ సూచించారు. బాబా కేదార్‌‌, నాలుగు క్షేత్రాల ఆశీర్వాదం మీ జీవితంలో కొత్త శక్తి, ప్రేరణ, సంకల్పాలను నింపాలని తన లేఖను ముగించారు.

శివనామస్మరణతో మార్మోగిన కేదార్‌నాథ్

పవిత్ర కేదార్‌నాథ్ ధామ్ వద్ద నేడు విశేష వైభవంతో ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ‘హర హర మహాదేవ్’ నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.

ఈ శుభసందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయాన్ని సందర్శించి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో తొలి ప్రార్థన సమర్పించిన ఆయన, రాష్ట్ర ప్రజల సుఖశాంతి, సమృద్ధి కోసం భగవాన్ శివుడిని ప్రార్థించారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. ద్వారాలు తెరచుకున్న క్షణంలో భక్తుల ముఖాల్లో అపార ఆనందం, విశ్వాసం వెల్లివిరిశాయి.

కేదార్‌నాథ్ ధామ్‌తో పాటు చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక గుర్తింపుకి ప్రతీక అని సీఎం ధామి పేర్కొన్నారు. యాత్రికులకు సురక్షిత, సౌకర్యవంతమైన, సక్రమంగా నిర్వహిత యాత్ర అనుభవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.