
చద్దా వదంతులు వ్యాప్తి చేస్తున్నారు: సంజయ్ సింగ్
పంజాబ్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుడు రాఘవ్చద్దాతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలను ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్సింగ్ ఆదివారం ఖండించారు. ఇవన్నీ పూర్తిగా వదంతులు, తప్పుడు ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఈ వదంతులను బీజేపీ, రాఘవ్ చద్దా ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్లో చద్దా, ఇతర రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బీజేపీలో చేరినందుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారని తెలిపారు. పార్టీని, పంజాబ్ ప్రజలను మోసం చేసిన వారిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ ఎమ్మెల్యేలు చద్దాతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారన్న వార్తలను పూర్తిగా ఖండించిన ఆయన, ఇవి కేవలం గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నమని అన్నారు.
గత శుక్రవారం ఆప్కు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సహ్ని, స్వాతిమాలీవాల్లు పార్టీని వీడి బీజేపీలో విలీనం అయ్యారు. పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతాలు, విలువల నుంచి దూరమైందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీకి చెందిన మొత్తం ఎంపీలలో రెండొంతులు మరో పార్టీలో విలీనం కావచ్చని పేర్కొన్నారు. ఆప్కు రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారని ఆయన చెప్పారు.
వారిని సస్పెండ్ చేయండి
అయితే సంజయ్ సింగ్ ఈ చర్యలపై తీవ్రంగా స్పందిస్తూ, పార్టీని వీడి వెళ్లిన ఈ ఏడుగురు సభ్యుల రాజ్యసభ సభ్యత్వాలు రద్దయ్యే అవకాశముందని తెలిపారు. తమ సభ్యత్వాన్ని ప్రమాదంలో పడేసేలా ఎవరూ వారితో కలవరు. రాజకీయాల్లో అందరికీ ఇది తెలుసని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, పార్టీ మారిన ఈ ఏడుగురు రాజ్యసభ సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ సంజయ్ సింగ్, రాజ్యసభ చైర్మన్కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
రాజ్యసభలో 7 ‘ద్రోహి’ ఎంపీలపై ఆప్ అనర్హత పిటిషన్ దాఖలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ పార్టీని వీడి బీజేపీలో విలీనం అయిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధకృష్ణన్కు పిటిషన్ సమర్పించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్ సింగ్, ఈ ఎంపీలు పార్టీ టికెట్పై గెలిచి తర్వాత మరో పార్టీలో చేరడం ద్వారా రాజ్యాంగంలోని ద్రోహ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం కూడా కొనసాగిస్తామని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ముఖ్యంగా ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ కేసుల్లో ఇటువంటి ఫిరాయింపులు అనర్హతకు దారి తీస్తాయని స్పష్టం చేశాయని చెప్పారు. అలాగే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఇటువంటి పార్టీ మార్పులు అనుమతించవని పేర్కొన్నారు. మొత్తంగా, పంజాబ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి.
