

జనగణన-2027పై అవగాహన.. నెక్లెస్ రోడ్లో ఘనంగా వాకథాన్
భారత ప్రభుత్వ జనగణన–2027 ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, జనగణన కార్యక్రమాల్లో పౌరులందరూ చురుగ్గా సహకరించాలని కోరుతూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో సోమవారం ఒక భారీ వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి అమల అక్కినేని ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.
తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హాళికెరి నేతృత్వంలో జరిగిన ఈ వాకథాన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ బి. సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు, సిబ్బంది, సాధారణ పౌరులు ఉత్సాహంగా అడుగులు వేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దేశ సమగ్ర ప్రణాళికలు, అభివృద్ధి పథకాల రూపకల్పనలో జనగణన డేటా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పారు. ప్రతి పౌరుడు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు కోరారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, "జనగణన–2027"ను విజయవంతం చేయాలని నినాదాలు చేస్తూ నెక్లెస్ రోడ్ పరిసరాల్లో సందడి చేశారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.
