
‘హోమిబాబా’లో సూపర్ స్పెషాల్టీ కోర్సులు
దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 3 క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. విశాఖపట్నంలోని ప్రఖ్యాత హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రంలో 3 ఎంసిహెచ్ కోర్సులను ప్రారంభించడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఎంసిహెచ్ సర్జికల్ ఆంకాలజిలో ప్రతి ఏడాది 2 సీట్లకు, ఎంసి హెచ్ గైనకలాజికల్ ఆంకాలజీ లో 4 సీట్లకు, డిఎమ్ మెడికల్ ఆంకాలజిలో 4 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. ఈ 3 విభాగాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం 13 ఎంసిహెచ్ సీట్లు మాత్రమే ఉన్నాయి. 120 పడకల తో కూడిన హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రం భారత ప్రభుత్వం వారి పూర్తి గ్రాంటుతో అణుశక్తి విభాగం పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ. మొత్తం 10 సీట్ల తో 3 క్యాన్సర్ స్పెషాల్టీ కోర్సులను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.
