Let's talk: editor@tmv.in
తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

Pinjari Chand
12 సెప్టెంబర్, 2025

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లక్నోలో, హర్దోయ్​ జిల్లాలో ఇటీవల రైలు ప్రమాదాలు జరిగాయి. ఎటువంటి ప్రాణం నష్టం జరగనప్పటికీ ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు మరింత భద్రతా చర్యలు చేపట్టే అవసరాన్ని సూచిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పూర్ణియా వెళుతున్న ప్రత్యేక రైలు ఘజియాబాద్​ జిల్లాలోని సాహిబాబాద్​ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా లేగేజీ కోచ్​ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళన చెందారు.

దట్టంగా వ్యాపించిన మంటలు

లగేజ్​ కోచ్​ లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో, చుట్టుపక్కల దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు మరింత ఆందోళన చెందారు. కొంతమంది రైలుదిగి పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటహుటిన తరలివచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన సంబంధిత లగేజీ కోచ్​ ను రైలు నుంచి వేరు చేసి రైలును పూర్ణయా పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మంటలు ఎలా వచ్చాయి. ఎవరైనా కావాలనే ఈ పని చేశారా? లేకుంటే షార్ట్​ సర్క్యూట్​ వలన ఈ ఘటన జరిగిందా, సాంకేతిక కారణాల వలన అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. మంటలు పక్క బోగీలకు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

తప్పిన పెను ప్రమాదం - Tholi Paluku