Let's talk: editor@tmv.in
ఉత్తరాంధ్రకు మోక్షం

ఉత్తరాంధ్రకు మోక్షం

FL - YUGDR
13 సెప్టెంబర్, 2025

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనా నైపుణ్యంతో ఉత్తరాంధ్ర‌ అభివృద్ధి బాటలో పయనిస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ మళ్లీ పుంజుకోవడం ఈ ప్రాంత రైతుల కలలను సాకారం చేయనుందన్నారు.

జ‌గ‌న్ హ‌యాంలో నిలిచిన ప్రాజెక్టులు

కాలాలతో సంబంధం లేకుండా నీరు అందుబాటులో ఉండేలా విశాఖ కేంద్రంగా నీటి నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం, ఏలేరు జలాశయాన్ని పోలవరం ఎడమ కాలువతో నింపడం, వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం వంటి చర్యలు సీఎం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందుతుందని, రెండు సంవత్సరాల్లోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే సీఎం ఆదేశం ప్రజల జీవితాలను మార్చనుందని అని పల్లా అన్నారు. "జగన్ హయాంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు అన్నీ నిలిచిపోయాయి. 2009లో ప్రారంభమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ పాలనలో పూర్తిగా దెబ్బతీశాడు. రూ.17,000 కోట్ల ఆర్భాటపు అనుమతులు ఇచ్చి ఒక్క రూపాయి పనీ జరగలేదు. ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చి, రుషికొండను బోడిగుండు చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌సీఎల్, ఐబీమ్, హెచ్ ఎస్ బీ సీ లాంటి కంపెనీలు జగన్ ముఠా దాష్టికాల వల్ల పారిపోయాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందనే అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించారు” అని మండిపడ్డారు.

కూట‌మి పాల‌న‌తోనే బంగారు భ‌విష్య‌త్తు

ఇక కూటమి ప్రభుత్వం మాత్రం పనిని మాటలకే పరిమితం చేయకుండా రూ.27,941 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులను పునఃప్రారంభించి, రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవ‌న్నారు. "భోగాపురం ఎయిర్‌పోర్ట్ విస్తరణ, టీసీఎస్, ఆర్సెలార్ మిట్టల్, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రలో కొత్త పెట్టుబడులు వలన వేలాది ఉద్యోగాలు వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుండి రూ.11,440 కోట్లు తెచ్చి 80 శాతం సామర్థ్యంతో నడుస్తున్న స్థితికి తీసుకొచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే” అని పల్లా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో సాగునీరు, తాగునీరు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడమే కాకుండా, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో బంగారు భవిష్యత్తు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రకు మోక్షం - Tholi Paluku