Let's talk: editor@tmv.in
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు

Venkatesh Balusula
13 సెప్టెంబర్, 2025

దేశ రాజ‌ధానిలో మ‌ళ్లీ బాంబు బెదిరింపులు క‌ల‌క‌లం రేపాయి. కొద్ది రోజుల క్రితం విద్యా సంస్థ‌ల‌కు బెదిరింపులు రాగా, తాజాగా హైకోర్టుకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు కోర్టు భవనం నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది అందరినీ ఖాళీ చేయించారు. స‌మాచారం అందుకున్న‌ బాంబు గుర్తింపు బృందం రంగంలోకి దిగింది. హైకోర్టు ప్రాంతానికి రాక‌పోక‌లు నిలిపివేసి తనిఖీలు చేప‌ట్టారు. పోలీసులు, అధికారుల త‌నిఖీల్లో అనుమానంగా ఏదీ ల‌భించ‌క‌పోవ‌డంతో దీన్ని ఫేక్ బెదిరింపుగా తేల్చారు.

ఉద‌య‌నిధి తనయుడికి యాసిడ్‌ హెచ్చ‌రిక‌

'కనిమొళి దేవిడియా' పేరుతో వచ్చిన ఈ మెయిల్ లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గది త్వరలో పేలిపోతుందని హెచ్చరించారు. 1998 కోయంబత్తూర్ పేలుళ్లను పాట్నాలో మళ్లీ సృష్టిస్తామని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఇన్బనిధిపై యాసిడ్ దాడి చేస్తామన్నారు. "సెక్యులర్ పార్టీలు కుటుంబ రాజవంశాలు, అవినీతి మీద ఆధారపడి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో పోరాడతాయ‌ని, వారసులైన రాహుల్ గాంధీ, ఉదయనిధి అధికారం నుంచి దూరమైతే ఆర్ఎస్ఎస్‌తో పోరాడటంలో ఆసక్తి కోల్పోతార‌ని ఈమెయిల్‌లో రాసుకొచ్చారు. సెక్యులర్ నాయకుడిని సృష్టించడానికి కొందరిని తొలగిస్తామని వెల్ల‌డించారు. డీఎంకేను డాక్టర్ ఎళిలన్ నాగనాథన్ చేపట్టాల‌ని, ఈ వారం ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఇన్బనిధిని యాసిడ్‌తో కాలుస్తామ‌ని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు దీని గురించి ఏమీ తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 2017 నుంచి పోలీసుల నుంచి త‌మ‌కు స‌హ‌కారం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌ర‌చూ ఫేక్ బెదిరింపుల‌తో ఆందోళ‌న‌

ఢిల్లీలో త‌ర‌చూ ఫేక్ బెదిరింపులు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో నకిలీ బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ వారం ఢిల్లీ సెక్రటేరియట్, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు కూడా ఇదే అనుభ‌వం ఎదురైంది. పోలీసుల విచార‌ణ‌లో ఇవ‌న్నీ న‌కిలీ బెదిరింపులుగా తేలాయి. గత నెలలో ఢిల్లీలోని 20 కాలేజీలకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. వాటిని కూడా పోలీసులు న‌కిలీ బెదిరింపులుగా తేల్చారు.ఈ మెయిల్ పంపిన వ్య‌క్తులు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి న‌కిలీ లొకేష‌న్ల నుంచి పంపుతున్న‌ట్లు పోలీసుల‌ ప్రాథమిక దర్యాప్తులో వెల్ల‌డైంది.

బెదిరింపుల వెనుక రాజ‌కీయ కుట్ర‌?

దేశ‌వ్యాప్తంగా ఇలాంటి నకిలీ బెదిరింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవ‌ల ముంబైలో సైతం బాంబు బెదిరింపులు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీలో గతంలో కాలేజీలు, మెడికల్ సంస్థలకు వచ్చిన వాటిని గ‌మ‌నిస్తే ఎవరో ఉద్దేశ‌పూర్వ‌కంగా భయాందోళనలు సృష్టించడానికి చేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈసారి దుండ‌గులు ఏకంగా హైకోర్టునే టార్గెట్ చేశారు. ఈ మెయిళ్ల‌లో స‌మాచారాన్ని గ‌మ‌నిస్తే దీని వెనుక‌ రాజకీయ కుట్ర ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. డీఎంకే నాయకులు, సెక్యులర్ పార్టీలు ప్రస్తావన రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. గత సంఘటనల్లో వీపీఎన్‌ వాడటం చూస్తే ఇది సాంకేతికత‌లో అనుభ‌వం ఉన్న వ్య‌క్తులే చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ స‌మ‌స్య‌తో నిందితుల‌ను గుర్తించ‌డం కష్టంగా మారింది. భద్రతా బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలాంటివి పదేపదే జరిగితే ప్రజల్లో భయం పెరుగుతుంది. సైబర్ దాడులు ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాల‌ను అనుస‌రిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు - Tholi Paluku